మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల తరువాత ప్రజలు కేవలం బిజెపికే కాదు ప్రతిపక్షాలకు కూడా కొన్ని విషయాలు స్పష్టం చేశారన్నది కొంత మంది మేధావుల అభిప్రాయం. అది నిజమే. ఈ దేశంలో ప్రజస్వామ్యం పని చెయ్యటం అవసరం అని ఈ దేశ ప్రజలు భావిస్తున్నారు, అలాగే దానికి తగ్గ వాతావరణాన్ని సృష్టించారు.
ఈ విషయం మొన్న రెండు sరాష్ట్రాలలో జరిగిన ఎన్నికల నుండే కాక దేశంలో వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల నుండి కూడా మనకి తెలుస్తున్నది. మేమింకా ప్రాణాలు వదులుకోలేదు అని ప్రజల రాజకీయ వర్గాలకి సున్నితంగా తెలియచేశారు. విరిగిపోయిన, తుప్పుపట్టిన సాధనాలతో కూడా ఎలా పనిచెయ్యొచ్చో మాకు తెలుసు. అంతా పూర్తి సవ్యంగా ఉండాలనుకునే మహానుభావులు కొందరు ప్రవక్త రాక కోసం వేచిచూడాలని ఉద్బోధ చేస్తున్నారు. అయితే ప్రవక్తలు భూమి మీద నడయాడే రోజులు ఎప్పుడో పోయాయన్న విషయం మనకి తెలుసు. మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న వనరులతోనే ఏ పనైనా చెయ్యాలి. ఈ ప్రపంచంలో ఏదీ సంపూర్ణమైనది కాదు. సరైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తూ ఇప్పటికే వంట్లో ప్రవేశించిన వ్యాధి మొత్తం వ్యాపించేవరకూ చూస్తూ కూర్చోలేము. జీవితం జీవించడానికే కదా ఉన్నది మరి. చావుకి ముందే చనిపోలేరు కదా ఎవరూ.
ప్రతిపక్షం కేవలం విసుక్కుంటా, ట్వీట్లు చేసుకుంటూ కాలం గడపటం కాకుండా ప్రతిపక్షంలాగా పని చెయ్యాలి అని ఈ ఎన్నికల ద్వారా ప్రజలు ప్రతిపక్షానికి తెలియచేశారని విశ్లేషకులు చెబుతున్న మాట వాస్తవమే. ప్రతిపక్షాలు వీధి పోరాటాలు చెయ్యాలి. వానలో తడవాలి, ఎండలో ఎండాలి, చెమటలో ముద్దవ్వాలి. ఒక ఎన్నికల ప్రచార సభలో వర్షం పడుతుంటే శరద్ పవార్ కుర్చీలనే గొడుగులుగా చేసుకోమని సభికులకి చెప్పాడు. ఆయన వర్షంలో తడుస్తూనే ప్రజలతో మాట్లాడాల్సి వచ్చింది. కొన్ని కొన్ని సార్లు వర్షపు నీరు నిన్ను పరిశుద్ధుడిని చేసి నీకు ధైర్యం ఇస్తుంది.
బిజెపి వాళ్ళ తలబిరుసుతనాన్ని ప్రజలు తిరస్కరించి, ప్రతిపక్షాలకి ఊపిరి ఊదారు. అయితే ఈ ఎన్నికల ద్వారా వివిధ రంగాలలోని నిపుణులకి కూడా ప్రజలు కొన్ని ప్రశ్నలు సంధించారు. మా వంతు వచ్చినప్పుడు మేము పని చేశాము. అయితే దేశ భద్రతా దళాలతో సహా న్యాయవ్యవస్థలో, శక్తివంతమైన బ్యూరోక్రసీలో, కేంద్ర దర్యాప్తు విభాగంలో, జాతీయ దర్యాప్తు ఏజెన్సీలో, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ లో పని చేస్తున్న మీరందరూ మీమీ బాధ్యతలు నిర్వహించారా అని ప్రజలు అడిగినట్లుంది. బ్యాలెట్ రూపంలో మాకు ఆయుధం ఉంది, దాన్ని వాడాము. సమయం వచ్చినప్పుడు మా బాధ్యత మేము నిర్వహించాము. అయితే మీరు మీ పని సరిగ్గా చేశారా? మీ ఆయుధాలని మీరు నైతికంగా వాడారా?
ఈ ప్రజాస్వామ్యం వింత ఏమిటంటే ఓటు వెయ్యగానే ప్రజలు శక్తివిహీనులు అయిపోతారు. వాళ్ళు కట్టబెట్టిన అధికారం వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతుంది. వారి అధికారాన్ని ఎవరెవరో అనుభవిస్తుంటారు. ప్రజల మంచి కోసం అని చెప్పి కోట్లు గడిస్తున్న ధనికులకి మానసికశక్తి ఉండదు. అందుకనే టాటా, నారాయణమూర్తి లాంటి వారు ఒక వ్యక్తికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. నిజానికి వారు ఆ వ్యక్తిని తీసిపారేయాలి. అంతేకాదు ఆర్ధికరంగంలో అద్భుతాలు సాధిస్తున్నారంటూ పచ్చి అబద్ధాలు ఆడుతూ చాలామంది ప్రస్తుత నాయకత్వాన్ని పొగుడుతారు. నిజానికి వారు చెప్పే ఆ ఆర్ధిక పరిపుష్టిని దేశం గత మూడు వందల సంవత్సరాలలో చవిచూడనే లేదు.
ధైర్యం, విశ్వాసం ఉండాలి అని ఇటువంటి వర్గాలకి ఈ ఎన్నికల ద్వారా ప్రజలు చెప్పారని అనిపిస్తున్నది. ఆ విశ్వాసం ఉండాల్సింది తాము చేసే పని మీద. దేశ భద్రత పేరు మీద కశ్మీరీల స్వాతంత్ర్యాన్ని వాయిదా వెయ్యటం భావ్యమేనా? చిదంబరం జామీను అభ్యర్ధనకు తొందరేమీలేదులే అని అనుకోవడం ఎలా సబబయింది? జాతీయ పౌర జాబితాని ఎందుకు అస్సాం ప్రజల నెత్తిన మోపారు?
సత్యం పట్ల విశ్వాసం ఎందుకు పోయింది వాళ్ళకి? అధికారంలో ఉన్నవారి అశ్రితులుగా ఎందుకు తయారయ్యారు? దేశం అన్నా, న్యాయం అన్నా అది ప్రజల గురించే అన్న విషయం ఎందుకు మర్చిపోయారు? చట్టాలు, నియమాలు అన్నీ కూడా ప్రజలకి ఒక గౌరవప్రదమైన జీవితం ఇవ్వటానికే కానీ నియంతలని సేవించటం కోసం కాదు. కేవలం సంరక్షకులగా ఉండవలసిన వారు యజమానులు ఎలా అయ్యారు? ప్రజల కోసం చేసిన చట్టాలనే ప్రజలకి వ్యతిరేకంగా వాడుతున్న ఈ పరిస్థితి ఎలా వచ్చింది?
ఈ పద్ధతులు మార్చుకోవాలి అని ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. జాతి, దేశం పేరు మీద మిమ్మల్ని బెదిరిస్తే బెదిరిపోకండి. అతి సామన్యమైన, అక్షర జ్ఞానం లేని వారు కూడా ఈ కుహనా జాతీయవాదాన్ని ధిక్కరించి చూపించారు.
ముస్లిం సమాజం మీద బహిరంగంగానే దాడులు చేస్తూ, ద్వేషం పెంపొందిస్తున్న నేటి రోజుల్లో కూడా ప్రజలు పదకొండు మంది ముస్లింలను గెలిపించారు.
“ఎవరికైనా సరే తమ దేవుడిని- రాముడైనా సరే అల్లా అయినా సరే- కొలుచుకునే హక్కు ఉంటుంది” అని సురేందర్ అనే టాక్సీ డ్రైవర్ నాతో అన్నాడు. అతను పోలింగ్ అనంతరం హర్యానాలోని రొహ్తక్ దగ్గర ఉన్న తన స్వగ్రామం నుండి ఢిల్లీ తిరిగివచ్చాడు. అతను గుర్గావ్ లో నివసిస్తున్నాడు. ఆరుబయట ఖాళీ ప్రదేశాలలో ముస్లింలని నమాజ్ చేసుకోనివ్వకుండా అడ్డుకోవడం అతనిని బాధించింది. “వాళ్ళేమన్నా ఆ భూమిని ఆక్రమిస్తున్నారా? ఒకరిని అవమానించటం మంచిది కాదు. అది పాపం” అని సురేందర్ అన్నాడు. సురేందర్ కూడా హిందూనే. తప్పొప్పొలు, న్యాయం అంటే తనకి ఉన్న అవగాహనే అతనిని చెడుకి వ్యతిరేకంగా పోరాడేలాగా చేస్తున్నది. అలాంటిది కులీన వర్గాల వారు చెడుతో సంధి ఎలా కుదుర్చుకోగలిగారు?
ఈ ఎన్నికల ఫలితాలను ఎన్నో విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షం తన పాత్ర సమర్ధవంతంగా నిర్వహించాలి అనేది వాస్తవం. అయితే మనందరం కూడా మన వంతు పాత్ర నిర్వహించాలి: మనకి మనం నిజాయితీగా ఉండాలి. సరైన అవకాశం వస్తుందిలే అనుకుంటూ కూర్చోకూడదు. ప్రజలకి మన వంతు సహాయం కేవలం ఈ విధంగా మాత్రమే అందించగలము- న్యాయమైన తీర్పులు ఇస్తూ, న్యాయంగా మాట్లాడటం, రాయడం, మన బాధ్యతలు మనం నిర్వహించడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని సంరక్షించగలం.
-అపూర్వానంద్
వ్యాసకర్త ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడు
‘ద వైర్’ వెబ్సైట్ సౌజన్యంతో