రాజకీయ అధికారం మార్పుతో జాతీయ జెండా రంగులు కూడా మారిపోతున్నాయి. కార్యకర్తలు అత్యుత్సాహంతో జాతీయ జెండా రూపును మార్చేస్తున్నారు. జాతీయ జెండాను చెరిపేసి వైసీపీకి సంబంధించిన నీలం రంగు వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎవరో కార్యకర్తలు చేసిన ఘనకార్యానికి అధికార వైఎస్ఆర్సీపీకి తలవంపులు వచ్చే పరిస్థితి ఎదురైంది.
అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తులను పెయింటింగ్ చేస్తున్నారు. అయితే, ఏకంగా జాతీయ జెండాను కూడా చెరిపేసి వైసీపీ రంగులు వేయడం విమర్శలకు తావిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఇదీ వైకాపా నేతల దేశభక్తి, మన జాతీయపతాకం పట్ల ఉన్న గౌరవం. ఇంత నిస్సిగ్గుగా జాతీయ పతాకానికి కూడా వైకాపా పార్టీ రంగులు వేస్తున్నారంటే, రేపు జాతీయపతాకం స్థానంలో వైకాపా జెండాని ఎగరేస్తారేమో! స్మశానాలను ఎలాగూ వదలడం లేదు, కనీసం జాతీయ జెండాని అయినా గౌరవించండి @ysjagan గారు! pic.twitter.com/kRQCyRvVFQ
— Lokesh Nara (@naralokesh) October 29, 2019
ఈ ఘటనపై గ్రామస్తులు, దేశభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయానికి జాతీయ జెండా రంగు ఉండకూడదా అంటూ వైసీపీ నాయకుల తీరును స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి జాతీయజెండా కంటే పార్టీ రంగులే ముఖ్యమయ్యాయా అని మండిపడుతున్నారు. జాతీయ జెండా రంగుతో పంచాయతీ భవనాన్ని నిర్వహిస్తే తప్పేముందని నిలదీస్తున్నారు. జాతీయ జెండా రంగులను చెరిపేసి.. వైసీపీ రంగులు వేసినవారు, వేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో టీడీపీ హయాంలో పంచాయతీ కార్యాలయాలకు టీడీపీని ప్రతిబింబించేలా పసుపు రంగులు వేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ పసుపు రంగులను చెరిపేసి వైసీపీ రంగులు వేస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలు, వాటర్ ట్యాంక్లు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇలా వైసీపీ రంగులు వేయడం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.