ఒక్క ఘటన… మూడు రూపాలు… భిన్న వార్తలు…! ఏది నమ్మాలి…? ఏది చదవాలి..?
ఇదీ సమాజానికి నాలుగో స్తంభంగా ఉండాల్సిన మీడియా పరిస్థితి. అందుకే
ఏది చదవకుండా ఉండిపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. సర్క్యులేషన్ పడిపోతుంది మొర్రో అని ఏడ్చే బదులు రాతలు మారితే తమ రాత మారుతుందని ఏనాడు గ్రహిస్తారో..? నిజానికి తెలుగు మీడియాలో ఎవరి అజెండా వారికి ఉంది. అందుకు అనుగుణంగా కథనాలు రాసుకోవచ్చు. కానీ జరిగిన ఒక యదార్థ ఘటనని కూడా దురుద్దేశాన్ని ఆపాదించి…, ఎక్కువ, తక్కువ చేసి చూపిస్తే దాన్ని జర్నలిజం అని, వార్త పత్రిక అని ఎందుకు అనాలి…? నిన్న జరిగిన ఘటనని సాక్షి పది అడుగులు ముందుకేసి ఎంపీని అంతమొందించాలని చూశారని, సామాజికవర్గాన్నీ కించపరిచారని రాయడం ఆ పత్రిక జర్నలిజాన్ని వీడి, శతశాతం కరపత్రంగా రూపాంతరం చెందింది అనిపిస్తుంది.
జరిగిన ఘటన : నిన్న గుంటూరు జిల్లా లేమల్లే గ్రామంలో రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మహిళలు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులకు గొడవ జరిగింది. ఘర్షణ వరకు వెళ్లి పోలీసుల ప్రవేశంతో ఆగింది.
దీన్ని ఎవరెలా రాశారంటే…!
ఆంధ్రజ్యోతి : మహిళా జేఏసీ నేతలపై దాష్టీకం. ఎంపీ సురేష్ అనుచరుల దాడి. దుర్భాషలాడిన సురేష్ అంటూ తోచింది రాసుకొచ్చారు. పూర్తిగా మహిళలు న్యాయబద్ధంగానే ఉన్నారని… సురేష్.., ఆయన వర్గీయులే అంతా చేశారని అమాయకమైన మహిళలపై దాడులు చేసి బస్సులో అటూ, ఇటు తిప్పారని రాసుకొచ్చారు. వారి అజెండా ప్రకారం… టీడీపీకి, ఆ జేఏసి వారికి అనుకూలంగా రాసేశారు.
సాక్షి : ఎంపీ సురేష్ పై టీడీపీ నేతల దాడి..!
ఎంపీని అంతమొందించేయత్నం. రక్షించిన గన్ మెన్లు… అంటూ రాసింది. పనిలో పనిగా సామాజిక వర్గాన్ని దించి, ఎంపీని ఆ మహిళలు చంపేయాలని చూశారని.., సామాజికవర్గంని కించపరిచారని ఎడాపెడా రాసేసింది. ఘటనకు ఏ మాత్రం సంబంధం లేని అంశాలను తెరపైకి తెచ్చి.., సానుభూతి డ్రామాలన్ని వార్తగా వండి, వడ్డించేసింది.
ఈనాడు : అమరావతి రణరంగం. జై అమరావతి అనడానికి నిరాకరించిన ఎంపీ సురేష్.., మహిళలను నెట్టేసి ఎంపీని తీసుకెళ్లిన రక్షక సిబ్బంది అంటూ రాసుకొచ్చింది. జరిగిన ఘటనను చాంతాడంత చూపించి, కొంత పైత్యాన్ని జోడించింది. మహిళల బస్సుని యువకులు వెంబడించారని.., పోలీసులు మహిళలను ముప్పుతిప్పలు పెట్టారని రాసుకొచ్చారు.
ఇదీ వాస్తవం ::
అసలు జరిగిన పంచాయతీ వేరు. ఇక్కడ మూడు పత్రికలు చెప్పింది వేరు. ఎవరి అజెండా ప్రకారం వారు రాశారు. నిజానికి గుంటూరు జిల్లాలోని అమరావతి పుణ్యక్షేత్రంలో రథోత్సవానికి ఎంపీ సురేష్ హాజరయ్యారు. తిరిగి వెళ్తున్నప్పుడు ఆయనను గమనించిన మహిళ జేఏసీ నేతలు ఆయనను అడ్డుకున్నారు. కారు దగ్గరకు వెళ్లి “జై అమరావతి” అనమని అడిగారు. ఆయన నిరాకరించారు. ఇక్కడ కొద్దిగా వాగ్వాదం జరిగింది. పరిస్థితి శృతి మించుతుండడంతో ఎంపీ రక్షకులు ఆయనను కారు ఎక్కించి తీసుకెళ్లిపోయారు. అనంతరం ఎంపీ అనుచరులు వచ్చారు. అక్కడే అసలు కథ మొదలయ్యింది. మా ఎంపీని అడ్డుకుంటారా అంటూ వాళ్ళు…, అమరావతిని వ్యతిరేకిస్తారా.., మమ్మల్ని అంటారా? అంటూ మహిళలు వాదులాట ప్రారంభించారు. మహిళలున్న బస్సు కదలకుండా యువకులు నీళ్ల డ్రమ్ములు అడ్డు పెట్టారు. ఈ లోగా ఓ మహిళ జరిగిన ఘటనని రికార్డ్ చేసి రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులకు చేరవేసింది. దీంతో గొడవ పెద్దది కాబోతోంది అని గ్రహించిన పోలీసులు మహిళలను బస్సులోనే తరలించారు. నిజానికి కళ్ళల్లో కారం ఎవరూ కొట్టుకోలేదు కానీ. ఎంపీ అనుచరులే కొందరు ముందు జాగ్రత్తగా కారం పొట్లాలు, కర్రలు తీసుకుని వచ్చారు. వాటిని చూసి మహిళలు తమకు ఏదో జరిగిపోతుంది అనుకుని చాలా పెద్ద రచ్చ చేశారు. తమకు రక్షణగా మిగిలిన రైతులు రావాలని ఆడియో రికార్డింగ్లు పంపించారు. మహిళలు అమరావతి పోలీస్ స్టేషన్ కి చేరుకునేసరికి అక్కడకు కొందరు రైతులు వచ్చి, కాసేపు ధర్నా చేశారు. ఈ ఘటన మొత్తం మీద పోలీసుల వైఫల్యం, ఇరువర్గాల అతి కనిపిస్తుంది. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్న క్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా జేఏసీ నాయకులు అడ్డుకుంటున్నారు అనే విషయం పోలీసులకు తెలియనిది కాదు. అయినా తేలిగ్గా తీసుకోవడం.., వారు ఏమైనా చేస్తేనే వెళ్లి నాయకులకు భజన చేసి, జేఏసీ వారిని టార్గెట్ చేయడం జరుగుతుంది. ముందస్తుగా ఇటువంటి ఘటనలు జరగకుండా…, రెండు వేర్వేరు బృందాలుగా ఇరువర్గాల వద్ద మోహరిస్తే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు.
శ్రీనివాస్ మానెం