(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి నూతన రధసారధులు ఎవరు అవుతారనే విషయం రాజకీయంగా చర్చనీయాంశ మవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా నేతల నుండి పోటీ కనబడటం లేదు కానీ తెలంగాణాలో మాత్రం నలుగురు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపిలో ప్రతి మూడేళ్ళకు ఒకసారి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు ఎంపికైన లక్ష్మణ్ మూడవ పర్యాయం కూడా కొనసాగాలని ఆశిస్తున్నా మార్పు తప్పదన్న సంకేతాలు పార్టీ అధిష్టానం నుండి వచ్చినట్లు సమాచారం. దీనితో అధ్యక్ష పదవి రేసులో ఆ పార్టీ నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, మాజీ మంత్రి డీకే అరుణ, సీనియర్ నేత రఘునందన్ రావుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే అని పదే పదే చెప్పుకుంటున్న బీజేపీ… టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనే సారథి కోసం అన్వేషిస్తోంది. అయితే ఇప్పటికే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి ముగ్గురి పేర్లు బీజేపీ హైకమాండ్ దగ్గర తుది ఎంపిక కోసం సిద్ధంగా ఉన్నాయని చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణనే రెండవ పర్యాయం కొనసాగించవచ్చని అనుకుంటున్నారు. ఇక్కడ పోటీ కూడా అధికంగా లేదన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మార్పు అనివార్యం అయితే ప్రస్తుతం బిజెపి ఎమ్మెల్సీలుగా ఉన్న పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు సమాచారం. ఎపీలో బిజెపి, జనసేన పొత్తులో కొనసాగుతున్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ విషయంలో మెజారిటీ రాష్ట్ర పార్టీ నాయకులు సానుకూలంగానే ఉన్నారన్న మాట వినిపిస్తోంది. మార్చి మొదటి వారంలో ఈ రెండు రాష్ట్రాల అధ్యక్షుల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.