ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదిశ చట్టంపై కేంద్రం లో ముందడుగు పడింది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడి చేసిన వారిని నేరం రుజువైతే 21 రోజుల్లోనే ఉరి తీయాలనే ఉద్దేశంతో ఈ బిల్లుని ఏపీశాసనసభ గత ఏడాది ఆమోదించింది. ఈ బిల్లు చట్టంగా రూపొంది అమల్లోకి రావాలంటే కొన్ని అవాంతరాలున్నాయి. వాటిని అధిగమిస్తేనే ముఖ్యమంత్రి సంకల్పం అమల్లోకి వచ్చినట్టు. కేంద్రం పరిధిలో ఉన్నఐపీసీ, సిఆర్పిసి చట్టాల్లో కొన్ని సవరణలు చేయాల్సి ఉంది. దీనిపై ఒక కీలక ముందడుగు పడినట్టు తెలుస్తుంది.
హోమ్ శాఖలో కదులుతున్న దస్త్రం…!
దిశ బిల్లు, ఆ చట్టం అమలు విషయమైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ని కలిసిన సందర్భంలో వివరించారు. చట్టం తీసుకురావాల్సిన అవసరం, పర్యవసానం, ముఖ్య ఉద్దేశం అన్నిటినీ వివరించారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రి ఐపీసీ, సిఆర్పిసి చట్టాల్లో సవరణలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హోమ్ శాఖ అధికారులను ఆదేశించారట. దశాబ్దాల తరబడి అమల్లో ఉన్న ఐపీసీ, సిఆర్పిసిలో సవరణలకు అవసరమైన సూచనలు కోరుతూ, అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర హోమ్ శాఖ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయనున్నట్టు తెలిసింది. మొత్తానికి ఏపీలో ఆమోదించిన బిల్లుపై అన్ని రాష్ట్రాల్లోనూ చర్చకు రానుండడం, కేంద్రంలో కదలిక తీసుకురావడం చర్చనీయాంశమే.