ఒంగోలు : ప్రకాశం జిల్లాలో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో పది మంది వ్యవసాయ కూలీలు మృత్యువాతపడ్డారు. నాగులప్పపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టగా, విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతులు రాపర్ల సమీపంలోని మాచవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
లాక్డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెసులుబాటు కల్పించడంతో నేటి ఉదయం కొందరు కూలీలు ట్రాక్టర్పై మిరప కోతలకు వెళ్లారు. సాయంత్రం పనులు పూర్తి అయిన తరువాత ఇళ్ళకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో ట్రాక్టర్లో సుమారు 15 మంది వరకు ఉన్నారని తెలుస్తున్నది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్, మరో మహిళ తీవ్రంగా గాయపడగా వారిని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు, ఓ రైతు ఉన్నారు.
సిఎం జగన్ దిగ్బ్రాంతి
ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిందిగా ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులను సీఎం జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.