రాజకీయ నాయకులంటే.. అంతే.. హడావిడి మామూలుగా చేయరు.. హంగూ, ఆర్భాటాలే వారికి ముఖ్యం. మిగతావన్నీ ఆ తరువాతే. అందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. వారు చేసే పనుల వల్ల సామాన్య జనాలకు తీవ్ర ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఆ విధంగానే నడిరోడ్డుపై ఆర్భాటం చేశారు. కరోనా నేపథ్యంలో విధించిన భౌతిక దూరం నిబంధనలను గాలికి వదిలేశారు.
ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం కొత్తగా 108, 104 ఆంబులెన్స్లను ప్రారంభించిన విషయం విదితమే. మంచిదే.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే అవి తప్పనిసరి. అయితే ఆ ఆంబులెన్స్ పేరు చెప్పి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నడిరోడ్డుపై హడావిడి చేశారు. అవసరం లేకున్నా ఆంబులెన్స్ సైరన్ వేసి న్యూసెన్స్ సృష్టించారు. తన అనుచరులు, వైకాపా నేతలు, కార్యకర్తలతో కలిసి ఆంబులెన్స్ ఎదుట హడావిడి చేశారు.
అసలే కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం మూలాన ఆ వైరస్ బారిన పడుతున్నారు. అలాంటి పరిస్థితిలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తన అనుచర గణం భౌతిక దూరం నిబంధనలను గాలికొదిలేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.