Adimulapu Suresh: సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరైనా ఒక నియోజకవర్గం నుండి ప్రజా ప్రతినిధిగా ఎన్నికయితే అక్కడి ప్రజలతో, క్యాడర్ తో విడదీయరాని అనుబంధం ఏర్పడుతోంది. ప్రజల కోసం, అక్కడి క్యాడర్ కోసం ఆ నాయకుడు పని చేస్తారు. ఆ నాయకుడికి అక్కడి క్యాడర్, ప్రజలు అండగా నిలుస్తూ ఉంటారు. గెలిచినా.. ఓడినా అదే నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని రాజకీయం చేస్తూ ఉంటారు. కానీ.. కొందరు నాయకులు మాత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటారు. వీరికి ఒక నియోజకవర్గాన్ని పర్మినెంట్ గా అంటిపెట్టుకుని ఉండరు. ప్రతి ఎన్నికలకు నియోజకవర్గం మారుతూ ఉంటారు. గెలుస్తూ ఉంటారు.
ఇందులో ముందు వరుసలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉంటారు. దాదాపు రెండున్నర దశాబ్దాల నుండి రాజకీయాల్లో ఆయన తన మనుగడ సాగిస్తూనే ఉన్నారు. 1999లో రాజకీయాల్లోకి వచ్చిన గంటా శ్రీనివాసరావు టీడీపీ తరపున అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2004లో చోడవరం నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నాటికి ప్రజారాజ్యం పార్టీ లో జాయిన్ అయి ఆ పార్టీ నుండి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచారు.
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. మళ్లీ 2014 వచ్చే సరికి టీడీపీలో చేరారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి గా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. మొత్తం అయిదు నియోజకవర్గాలు, ఒక సారి ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యే. పోటీ చేసిన స్థానంలో మరో సారి పోటీ చేయలేదు.
అదే వరుసలో ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత, మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఉన్నారు. ఐఆర్ఎస్ అధికారిగా పని చేసిన ఆదిమూలపు సురేష్ స్వచ్చంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2009 లో ఉమ్మడి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ఆర్ మరణానంతరం జగన్ వెంట నడిచారు సురేష్. 2014 ఎన్నికల్లో అదే జిల్లాలోని మరో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం సంతనూతలపాడు నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన వారిలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లినప్పటికీ ఆదిమూలపు సురేష్ మాత్రం జగన్ వెంటే నిలిచారు.
2019 ఎన్నికలు వచ్చే సరికి సంతనూతలపాడు వదిలేసి మళ్లీ యర్రగొండపాలెం నుండి పోటీ చేసి విజయం సాధించారు. వరుసగా రెండు సార్లు గెలవడంతో సీఎం జగన్ తన తొలి కేబినెట్ లోకి తీసుకుని విద్యాశాఖ శాఖ అప్పగించారు. రెండున్నరేళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డిని పక్కన పెట్టినా ఆదిమూలపు సురేష్ ను మాత్రం జగన్ కొనసాగించారు. విద్యాశాఖను బొత్స సత్యనారాయణకు మార్పు చేసి ఆదిమూలపు సురేష్ కు మున్సిపల్ శాఖ ఇచ్చారు. సీఎం జగన్ సొంత జిల్లా కడప కు ఇన్ చార్జి మంత్రిగానూ ఆదిమూలపు సురేష్ ను నియమించారు.
నియోజకవర్గాలు మారుతున్నా 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూనే ఉన్నారు సురేష్. ఇప్పుడు నాల్గో సారి మరో నియోజకవర్గానికి మారబోతున్నారు. ఆదిమూలపు సురేష్ ను కొండపికి నియోజకవర్గానికి ఇన్ చార్జిగా మార్చారు సీఎం జగన్. యర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ పై కొంత వ్యతిరేకత రావడం, అక్కడి నేతలు వచ్చే ఎన్నికల్లో సురేష్ కు మద్దతుగా పని చేయమని తేల్చి చెప్పడం వంటి కారణాలతో సురేష్ ను కొండపి నియోజకవర్గానికి పార్టీ ఇన్ చార్జిగా మార్చారనే టాక్ నడుస్తొంది. ఇప్పుడు ఆదిమూలపు సురేష్ కొనసాగిస్తున్న రాజకీయ ప్రస్థానం చూస్తుంటే గంటా శ్రీనివాసరావు తర్వాత ఆ రికార్డు సాధిస్తున్నట్లుగా కనబడుతోంది.
కాకపోతే.. ఇద్దరి మధ్యే ఒక వత్యాసం ఉంది. గంటాకు రెండు మూడు పార్టీలు మారిన చరిత్ర ఉండగా, ఆదిమూలపు సురేష్ మాత్రం తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలోనే ఉన్నారు.
Janasena- TDP: త్యాగరాజులు అవుతారా..? తిరగబడతారా..? టీడీపీలో అంతర్మధనం..!