పీఎస్ఎల్వీ సీ -56 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఇవేళ ఉదయం 6.31 గంటలకు పీఎస్ఎల్వీ సీ – 56 ప్రయోగం నిర్వహించారు. నాలుగు దశల్లో రాకెట్ ప్రయోగం జరిగింది. కాగా, 25.30 గంటల పాటు కౌంట్ డౌన్ తో నింగిలోకి దూసుకువెళ్లిన పీఎస్ఎల్వీ సీ – 56 విజయవంతంగా కక్షలోకి దూసుకువెళ్లింది. సింగపూర్ కు చెందిన 420 కిలోల బరువు గల ఏడు ఉప గ్రహాలను దీని ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఏడు ఉప గ్రహాలను నియో ఆర్బిట్ లోకి ప్రవేశ పెట్టనున్నారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.
ఇక ఈ నెలలో ఇస్రోకు ఇది రెండో ప్రయోగం కావడం విశేషం. ఒకే నెలలో రెండు ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. పీఎస్ఎల్వీ సిరరీస్ లో ఇది 58వ ప్రయోగం. ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ నిర్దేశించిన కక్షలో రాకెట్ ను విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు. సెప్టెంబర్ నెలలో మరో పీఎస్ఎల్వీ ప్రయోగం చేపడతామని చెప్పారు. అది కూడా పూర్తిగా కమర్షియల్ ప్రయోగమని వెల్లడించారు.
రాకెట్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అభినందనలు తెలిపారు. ఏడు ఉపగ్రహాలతో విజయవంతంగా రాకెట్ ను ప్రయోగించిన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.