ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు మరో సారి ఢిల్లీకి వెళుతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఎల్లుండి 28వ తేదీ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో జగన్ భేటీ కానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే సీఎంఓ కార్యాలయం ఇంత వరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి పలు పెండింగ్ సమస్యలపై ప్రధానితో చర్చించున్నారని సమాచారం.
ఇదే క్రమంలో గత విజ్ఞప్తుల మేరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.5,036.32 కోట్ల విడుదలకు కేంద్ర జలశక్తి శాఖ అంగీకారం తెలిపిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. అదే విధంగా అదనపు రుణ పరిమితి, మూడు రాజధానుల అంశం పైనా పీఎం మోడీకి సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించే అవకాశం ఉంది. పొరుగు రాష్ట్ర సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రారంభించిన నేపథ్యంలో వైసీపీ ఎటువంటి వైఖరితో ఉన్నది అనే విషయాలపైనా మోడీతో మాట్లాడనున్నారు. ఏపిలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలను వైసీపీ ముఖ్యనేతలు కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో మరో ఏడాదిన్నర పాటు సంక్షేమ పథకాలను యథావిదిగా కొనసాగించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో పూర్తి పదవీ కాలం అయ్యే వరకూ ఆగడమా లేక ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదా అనే విషయాలపైనా ప్రధాని మోడీ సలహా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు సన్నద్దం అయ్యే సమయం ఇవ్వకుండా గతంలో కేసిఆర్ మాదిరిగానే బీజేపీ పరోక్ష మద్దతుతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడమా లేదా అనే విషయాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి దగ్గర కావాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా పార్టీ అధిష్టానం అందుకు సముఖంగా లేదన్నట్లుగా సంకేతాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపైనా ప్రధానంగా చర్చ జరుగుతుందని అంటున్నారు. ప్రధాన మంత్రి మోడీ తో భేటీ అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు