ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలను, వాటితో పాటు అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలను ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి గురువారం వర్చువల్ కార్యక్రమం ద్వారా వీటిని సీఎం జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 14 డిజాస్టర్ రెస్పాన్స్ వాహనాలను, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలను పోలీస్ శాఖకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి త్వరలో పెద్ద ఎత్తున వాహనాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. త్వరలోనే వాటిని పోలీస్ శాఖకు అప్పగిస్తామని తెలిపారు.
అగ్నిమాపక శాఖలో సంవత్సరాల క్రితం ఇచ్చిన వాహనాలే కొనసాగుతుండటంతో వాటిలో కొన్నిరిపేర్లు వచ్చి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాద సమాయాల్లో వేగంగా వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. ఈ నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త వాహనాలు వచ్చాయి. ఎటువంటి విపత్తు జరిగినా అన్ని ఉపకరణాలు ఉండేలా..20 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం వెళ్లేలా విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు చెందిన 14 వాహనాలు రూపుదిద్దుకున్నాయి. అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్ కి ఇవి కనెక్ట్ కానున్నాయి. వీటి ద్వారా ప్రమాద ఘటన వద్ద క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పోలీస్ శాఖ సత్వర నిర్ణయాలు తీసుకోనున్నది.
ఆరోగ్య సేవలకు నాలుగు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కొత్త 104, 108 అంబులెన్స్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్త అంబులెన్స్లు ఇప్పుడు వేగంగా క్షతగాత్రులను, ఇతర వైద్య సేవలు అవసరమైన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి సకాలంలో వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. అత్యవసర సేవలకు సంబంధించి వాహనాలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.