ESMA: తమ డిమాండ్ల సాధన కోసం గత 26 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పలు దఫాలుగా నిర్వహించిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో అంగన్ వాడీలు ఆందోళన ఉదృతం చేశారు. దీంతో అంగన్ వాడీలపై ఏపీ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది.
ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు సమ్మెను నిషేదిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది ప్రభుత్వం. అంగన్ వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ ఏపీ సర్కార్ జీఓ నెంబర్ 2ను విడుదల చేసింది. దీని ప్రకారం ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేదిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరో వైపు సమ్మె చేసిన కాలానికి అంగన్ వాడీల వర్కర్లు, హెల్పర్ ల వేతనంలో కోత విధించింది. సుమారు రూ.3,450 తగ్గించి రూ.8,050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది.
తమపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్ వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 2 పై హైకోర్టు ను ఆశ్రయించే ఆలోచనలో అంగన్ వాడీలు ఉన్నట్లు తెలుస్తొంది. అంగన్ వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని వివిధ రాజకీయ పక్షాలు తప్పుబడుతున్నాయి.
ఏపి ప్రభుత్వ చర్యలు నియంత పోకడలకు పరాకాష్ట గా అభివర్ణించారు నారా లోకేష్. జీవో నెం.2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్ వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. అంగన్ వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి .. రాజకీయాల్లో నిమగ్నమైయ్యారని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినా .. గెలవటం అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వాదులంతా ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలని ఆయన కోరారు.
Ration Scam: రేషన్ కుంభకోణంలో టీఎంసీ నేతను అరెస్టు చేసిన ఈడీ
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!