AP High Court: విశాఖ రిషికొండ తవ్వకాలపై ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రిషికొండ పై తవ్వకాలు ఏ మేరకు జరిగాయి అనే దానిపై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారుల బృందాన్ని హైకోర్టు ఆదేశించింది. రుషికొండపై అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనీ, వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్ విచారణ సమయంలో అనుమతికి మించి 20 ఎకరాలు తవ్వారని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు విపించగా, మూడెకరాలు అదనంగా తవ్వడం జరిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు.
విభిన్న వాదనల నేపథ్యంలో సర్వేకు ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు తెలిపింది. అదనంగా తవ్వితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తామని హైకోర్టు చెప్పింది. సర్వే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది. అనుమతికి మించి ఎంత మేర తవ్వకాలు చేపట్టారు. ఎంత మేర భవనాలు నిర్మిస్తురో సర్వే చేయాలని ఆదేశిస్తూ సర్వే నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.