AP High court: కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా కుప్పం మున్సిపాలిటీలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందనీ టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరో పక్క టీడీపీ ప్రలోభాలకు, దౌర్జన్యాలకు పాల్పడిందని వైసీపీ ఆరోపణలు చేసింది. ఇరు పార్టీలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేసుకున్నాయి. రేపు ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో కుప్పం టీడీపీ అభ్యర్ధులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కుప్పం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని పిటిషన్ లో కోరారు. ఓట్ల లెక్కింపును వీడియో రికార్డింగ్ చేయించాలని కోరారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
AP High court: ప్రత్యేక పరిశీలకుడుగా ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ప్రత్యేక పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డిని నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఓట్ల లెక్కింపును వీడియో రికార్డు చేయించాలని ఎస్ఈసీ ని ఆదేశించింది. కౌంటింగ్ వీడియో రికార్డింగ్ ను న్యాయస్థానంకు సమర్పించాలని హైకోర్టు పేర్కొంది.
మరో పక్క కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్ఈసీ నీలం సాహ్ని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీల నుండి పోలింగ్ కు సంబంధించి ఎలాంటి రిపోర్టు అందలేదని చెప్పారు. కుప్పం మున్సిపాలిటీలో 72.19 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని చెప్పిన ఎస్ఈసీ నీలం సాహ్ని.. పోలింగ్ పూర్తి అయిన తరువాత బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచామని తెలిపారు.