AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్యంతర బెయిల్ నేపథ్యంలో మరిన్ని షరతులు విధించాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. నవంబర్ 3వ తేదీ ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఆరోగ్య కారణాల రీత్యా హైకోర్టు నిన్న మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో పలు షరతులు కూడా కోర్టు విధించింది.
అయితే మరిన్ని షరతులు విధించాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. ఆ పిటిషన్ లపై ఇవేళ మరో సారి విచారణ చేపట్టింది దర్మాసనం. ర్యాలీలు చేపట్టవద్దని, మీడియాతో మాట్లాడవద్దని కోర్టు షరతులు విధించింది. రాజకీయ ప్రసంగాలు చేయకూడదనీ, ర్యాలీలు చేపట్టకూడదని, మీడియాతో మాట్లాడకూడదని, ఇద్దరు డీఎస్పీలను ఆయనతో పాటు ఉండేలా పలు షరతులు విధించాలని సీఐడీ కోరింది.
ఇవేళ విచారణ సందర్భంగా చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించారని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. జైల్ నుండి విడుదలైన చంద్రబాబు మీడియాతో మాట్లాడారానీ, ర్యాలీగా దాదాపు 14 గంటల పాటు ప్రయాణించి రాజమండ్రి నుండి ఉండవల్లికి చేరుకున్నారని తెలుపుతూ అందుకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ ను సీఐడీ న్యాయవాదులు ధర్మాసనానికి చూపించారు. కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా మీడియాతో మాట్లాడారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
కోర్టు ఆదేశాలను ఎక్కడా చంద్రబాబు అతిక్రమించలేదని ఆయన తరపు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. చంద్రబాబు మాట్లాడటం అనేది ఆయన ప్రాధమిక హక్కులలో భాగమే తప్ప అతిక్రమణ కాదని అన్నారు. జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో కోర్టులు కల్పించాయన్నారు. సీఐడీ చెబుతున్న షరతులు ఆయన హక్కులు హరించే విధంగా ఉన్నాయన్నారు. కేసు దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం చూపుతుందో సీఐడీ అధికారులు చెప్పలేకపోతున్నారని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం నవంబర్ 3వ తేదీ తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది.
Telangana Assembly Polls: చంద్రబాబు మిడల్ డ్రాప్ ఎవరి కోసం ..? ఏ పార్టీ ప్రయోజనం కోసం అంటే..?