Yuvagalam Padayatra: నారా లోకేష్ యువగళం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. లోకేష్ తన పాదయాత్రలో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు స్వీకరించేందుకు లోకేష్ నిరాకరించారు. బుధవారం రాత్రి భీమవరం గనుపూడి వంతెన సమీపంలో యువగళం పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
లోకేష్ పాదయాత్ర దారిలో వైసీపీ శ్రేణులు జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తుండటంతో వారి మీదకు టీడీపీ శ్రేణులు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పలువురు పోలీసులతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు గాయాలైయ్యాయి. శివరామరాజు గుండెపై రాయి బలంగా తగలడంతో రిబ్ ఫ్రాక్చర్ అయ్యింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
కాగా అర్ధరాత్రి సమయంలో బేతపూడి క్యాంప్ సైట్ వద్దకు చేరుకున్న పోలీసులు పలువురు యువగళం పాదయాత్ర వాలంటీర్లు, కిచెన్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. యువగళం పాదయాత్రకు అనుమతి ఇచ్చి అదే రూట్ లో వైసీపీ కార్యకర్తలు కవ్వించు చర్యలు, రాళ్ల దాడి చేస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క భీమవరం నియోజకవర్గ పరిధిలోని బేతపూడి క్యాంప్ సైట్ లో ఉన్న నారా లోకేష్ వద్దకు చేరుకున్న పోలీసు అధికారి నోటీసులు అందజేశారు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే లోకేష్ పోలీసుల నోటీసులు తీసుకునేందుకు తిరస్కరించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ పలువురు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది పోలీసుల తీరు వ్యవస్థకే చెడ్డపేరు వస్తొందని అన్నారు. వైసీపీ శ్రేణులే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమను కించపరిచేలా ఫ్లెక్సీలు పెడుతున్నప్పుడు వాటిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. తాడేరు వద్ద వైసీపీ శ్రేణులే తమ పై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పాదయాత్రలో శాంతి భద్రతలకు తానెక్కడా విఘాతం కల్గించలేదని అన్నారు. యువగళం వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత వరకూ పర్యటించిన ఏ జిల్లాలోనూ జరగని గొడవలు భీమవరంలోనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. రెచ్చగొట్టేలా తాను ఏ వ్యాఖ్యలు చేశానో చెప్పాలన్నారు.
CM YS Jagan: దేశం మొత్తం ఉలిక్కిపడే బిల్లు ఏపీ అసంబ్లీ లో ప్రవేశపెట్టబోతోన్న జగన్ !