Big Breaking: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లా నరసరావుపేట పర్యటనను పోలీసులు భగ్నం చేశారు. గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లేందుకు హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూర జిల్లా గోళ్లపాడు లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు వద్దనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ నిబందనల కారణంగా పర్యటనకు అనుమతి లేదని చెప్పారు. లోకేష్ ను పోలీస్ జీపులో ఎక్కించారు. లోకేష్ ను ఎక్కడి తీసుకువెళుతున్నారు అనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. లోకేష్ ను అడ్డుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తరలిస్తున్న వాహన శ్రేణిని అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా వారిని పోలీసులు చెదరగొట్టారు.
పోలీసులు తనను అడ్డుకోవడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీపీ హర్షవర్ధన్ తో లోకేష్ వాగ్వివాదానికి దిగారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పాలని నిలదీశారు. ఇప్పటి వరకూ పోలీసులకు సహకరించానని చెప్పిన లోకేష్..నోటీస్ ఇచ్చి ఏ సెక్షన్ కింద అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ తన పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదని అన్నారు. ధర్నాలు, ఆందోళనలు చేయడానికి తాను వెళ్లడం లేదనీ, ఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నానని పేర్కొన్నారు.
మరో పక్క తెల్లవారుజాము నుండే లోకేష్ నరసరావుపేట పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విజయవాడ, గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు.