Visakhapatnam Land Scam YCP MLA: జగన్మోహనరెడ్డి సర్కార్ విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా ఉంచి, విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి కర్నూలును న్యాయరాజధానిగా చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. మూడు రాజధానులు అనేది పేరుకు మాత్రమే కానీ పరిపాలనా రాజధాని అంటే విశాఖనే పూర్తిగా రాజధాని అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంటే సెక్రటేరియేట్, సీఎంఓ, అన్ని శాఖల హెచ్ఓడిలు అక్కడికే వెళతాయి కనుక అదే రాజధానిగా స్థిరపడిపోతుంది. పేరుకు మాత్రమే అమరావతి, కర్నూలు శాసన, న్యాయరాజధానులుగా ఉంటాయి. అమరావతి అనే బ్రాండ్ పొగొట్టాలి, చంద్రబాబు ముద్ర చెరిపివేయాలి అంటే కొత్తగా విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే జగన్ మార్కు కనబడుతుంది.
నిజానికి విశాఖపట్నం పరిపాలనా రాజధాని అనుకోకముందు నుండే అంటే 2015 -16 కాలం నుండి అక్కడ భూ అక్రమాలు విపరీతంగా జరిగాయి. దానికి కారణం అక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండటం ఒక కారణం అయితే మోసం చేసే తెలివితేటలు ఉన్న వారు అక్కడ ఎక్కువ మంది ఉండటం రెండవ కారణం. ఈ రెండు కారణాలతో అక్కడ భూదందాలు విపరీతంగా జరిగాయి. దాంతో ఎక్కువ మంది మోసపోయారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే మోసపోయిన వారి జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు కూడా ఉండటం విడ్డూరం, విచిత్రం. అప్పనంగా తక్కువ రేటుకు భూములు వస్తున్నాయి కదా అని వాటిని కొనేస్తే దాని బాగోతం తరువాత తెలిస్తే ఇలానే ఉంటుంది. విశాఖలో ఈ స్కామ్ లు ఎక్కువ. ఎందుకంటే విశాఖ నగరానికి చుట్టుపక్కల లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. వాటిని ఆసరాగా చేసుకుని మోసాలరు తెరలేపడం, అత్యాశపరులను మోసం చేయడం జరుగుతుంది. నకిలీ పత్రాలను సృష్టించి స్థలాలను తక్కువ ధరలకు విక్రయిస్తుంటారు. ఆ తరువాత అసలు యజమాని వచ్చి గొడవ చేస్తుంటాడు. ఇటువంటి ఘటనల్లో సాదాసీదా వ్యక్తులు మోసపోయారు అంటే అది పెద్దగా చర్చనీయాంశం కాదు కానీ ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ బుక్ అవ్వడం విశేషం.
ఈ స్కామ్ విషయానికి వస్తే…విశాఖ సమీపంలోని కొమ్మాదిలో 12.26 ఎకరాల భూమి విలువ సుమారు వంద కోట్లు. ఆ భూమి యజమాని ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. అయితే భూ అక్రమాలు చేసే వారు కొందరు ఈ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి తక్కువ ధరకు ఇస్తామని బేరం పెట్టారు. వంద కోట్ల విలువైన ఆస్తి కేవలం రూ.19 కోట్లకు వస్తుండటంతో యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు బేరం కుదుర్చుకుని జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఈ విషయం తెలిసి ఆమెరికాలో ఉన్న భూయజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు అలర్ట్ అవ్వడంతో వందల కోట్ల భూస్కామ్ వెలుగులోకి రావడం తీవ్ర సంచలనం అయ్యింది. ఈ ఘటన విశాఖలో జరుగుతున్న భూదందాలకు ఓ ఉదాహరణగా మారుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఓ బాధితుడుగా అయ్యాడు అంటే సామాన్య పౌరులు ఎంత మంది మోసపోతున్నారో కదా. ఈ ఘటనలో కన్నబాబురాజును మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
పరిపాలనా రాజధానిగా విశాఖ చేస్తున్నప్పుడు ప్రభుత్వం మొదట భూ అక్రమాలను ఎందుకు కంట్రోల్ చేయడం లేదు. విశాఖ ప్రాంతంలో తెలుగుదేశం హయాంలోనే భూ అక్రమాలు భారీగా జరిగాయి. అక్కడి భూదందాలపై ఆరోపణలు రావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2017లో సిట్ వేసింది. ఆ సిట్ నివేదిక తెలుగుదేశం ప్రభుత్వం 2019లో దిగిపోయే సమయానికి రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అయినా ఆ సిట్ రిపోర్టు తీసుకున్నారా అంటే అదీ లేదు. దానిపై ఇంత వరకూ అధికారికంగా చర్యలు తీసుకోలేదు. అయితే ఆ సిట్ రిపోర్టును అడ్డం పెట్టుకుని ఎవరైతే భూ అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరెవరైతే వాటిలో పెద్దవాళ్లు ఉన్నారో, ఎవరైతే వాటితో బాగుపడుతున్నారో తెలుసుకుని వారిని కొందరు వైసీపీ నేతలు పిలిచి మీరు అక్కడ ఇది చేశారు, ఇక్కడ ఇది చేస్తారు మీరు కొంత ఇచ్చుకోండి లేకపోతే భూమి వదిలేసుకోండి అని బెదిరిస్తూ సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ విధంగా అక్కడ భూదందాలు నడుస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజానీకానికి పరిపాలనా రాజధాని చేయడం ఇష్టంలేదన్న వాదనలు వినబడుతున్నాయి.
read More: YS Sharmila: ఎంఆర్పీఎస్ నేత మంద కృష్ణమాదిగతో వైఎస్ షర్మిల భేటీ..! రెండు కారణాలు..!!