ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్ లో మెజార్టీతో మరో సారి అధికారంలోకి రాగా, మేఘాలయలో హాంగ్ వచ్చింది. మేఘాలయలో సిఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని పీపుల్స్ పార్టీ 26 స్థానాలు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించినా, మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ అయిదు, బీజేపీ నాలుగు సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 24 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో సంగ్మాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్దమని బీజేపీ ప్రకటించింది.
నాగాలాండ్ లో ఎన్డీపీపీ – బీజేపీ కూటమి విజయం సాధించింది. అక్కడి అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా, ఎన్డీపీపీ – బీజేపీ కూటమి 38 స్థానాలు కైవశం చేసుకుంది. ఎన్వీపీ 4, ఎన్వీఎఫ్ 2, ఇతరులు 16 స్థానాలు గెలుచుకున్నారు. త్రిపురలోనూ బీజేపీ కూటమిదే పైచేయిగా నిలిచింది. త్రిపుర అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా, బీజేపీ – ఐపీటీఎఫ్ కూటమి 33 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 31 కంటే రెండు స్థానాలు అధికంగా చేజిక్కించుకుంది. కాంగ్రెస్ – వామపక్ష కూటమి 14 స్థానాలు దక్కించుకోగా, తొలి సారి ఎన్నికల బరిలో దిగిన తిప్రా మెథా పార్టీ 13 స్థానాల్లో సంచలన విజయం అందుకుంది. అయితే ఈ రాష్ట్రంలో బీజేపీ కూటమి అధిక్యం తగ్గడానికి కొత్త పార్టీ త్రిపా మోథానే కారణంగా కనబడుతోంది.
కాగా మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సభలో మోడీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ప్రేమను చూపించారని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. విజయం కంటే ప్రజలు చూపించే ప్రేమ ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో ఉన్న ధృఢమైన విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వివరించారు. ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీకి దూరంగా ఉండొచ్చేమో కానీ తన హృదయానికి మాత్రం దగ్గరగానే ఉంటాయని మోడీ వ్యాఖ్యానించారు. ఇక ఓటమిని తట్టుకోలేని కొందరు ఈవీఎంలను తప్బుబడుతున్నారని విమర్శించారు.
ఏపి సర్కార్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం .. అమరావతి కేసు ఆ రోజునే విచారణ