ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విశాఖ ఇన్వెస్టర్ సమ్మిట్ కు ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విచ్చేసే అతిధులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏపి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల కోసం హెలికాఫ్టర్లు, లగ్జరీ కార్లను ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీవీఐపీలు, వీఐపీల కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లలో దాదాపు 800 గదులను సిద్దం చేశారు. ఈ సమ్మిట్ కి 35 మంది టాప్ ఇండస్టియలిస్ట్ లు, 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్ లు తరలివస్తున్నారు. సమ్మిట్ కోసం ఇప్పటికే 1200 లకు పైగా రిజిస్ట్రేషన్ లు జరిగాయి. సమ్మిట్ లో పాల్గొనడానికి అంబానీ, ఆదానీ, మిట్టల్, అదిత్య బిర్లా, జీఎంఆర్ తదితర పారిశ్రామిక దిగ్గజాలు, అలానే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి తదితరులు ప్రత్యేక విమానాల్లో వస్తున్నారు.
ఇప్పటికే ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖకు చేరుకుని బస చేశారు. ఈ సదస్సుకు దాదాపు పదివేల మందికిపైగా ప్రతినిధులు హజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సదస్సు ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలమని ప్రభుత్వం భావిస్తొంది. అతిధుల కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక బస, విందు వంటి ఏర్పాట్లను చేసింది. నగర సుందరీకరణలో భాగంగా పలు కూడళ్లను తీర్చిదిద్దడం, రహదారుల మరమ్మత్తులు, విభాగినుల వద్ద పచ్చదనం ఉండేలా చర్యలు, బీచ్ ల సుందరీకరణ వంటి వాటికి దాదాపు వంద కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇదిలా ఉండే ఇన్వెస్టర్స్ సదస్సు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఈ సందర్బంగా ఏపి ప్రభుత్వానికి అభినందలు తెలిపిన పవన్ కళ్యాణ్..ప్రభుత్వానికి ఈ అంశంలో జనసేన సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. పకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి దేశ విదేశాల నుండి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందన్నారు. మా శక్తి వంతమైన, అనుభవం కల్గిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యతుత్, మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతో పాటు ఇన్వెస్టర్స్ కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందాలని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం.. ఏపిలో ఆర్దిక వృద్దికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్ర తీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి, రివర్స్ టెండరింగ్, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కల్గించండి అని పేర్కొన్నారు.
ఈ సమ్మిట్ ఆలోచనలు కేవలం విశాఖకే పరిమితం చేయవద్దు. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప,.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్ లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపి మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్స్ సమ్మిట్ లాగా మార్చండి. ఇక చివరిగా రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సహకారం అందిస్తుంది. ఇన్వెస్టర్ ల సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు. మాకు రాజకీయం కంటే రాష్ట్ర శ్రేయస్సు మిన్న అని పవన్ కళ్యాణ్ ట్వీట్ లు చేశారు.
ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా.. ఎన్నికల ఫలితాలు ఇలా..