Black Fungus: ఓ వైపు కరోనా కలకలం కొనసాగుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ భయం జనాలను వణికిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వెలుగుచూడగా.. బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలో వెలుగు చూడడం కలకలంగా మారుతోంది. ఇప్పటికే ఏపీలో రోజుకు 20 వేల కరోనా కేసులు వస్తుండగా ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుంది. పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటం ఆందోళనకు కారణంగా మారుతోంది.
విజయవాడ , కృష్ణా, ప్రకాశం…
ఏపీ కృష్ణ జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు గుర్తించారు. ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్ తో మరణించాడని సమాచారం. మరోవైపు విజయవాడలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతి ENT హాస్పిటల్ లో రోజులో 10 లోపు కేసులు వస్తున్నాయి. సింగరేణి హాస్పటిల్స్ లో రోజుకి 7-8 కేసులు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో పది రోజుల వ్యవధిలో 12 మందికి పైగా బ్లాక్ ఫంగస్ బారినపడగా… కేవలం మార్కాపురంలోనే ఏడుగురికి బ్లాక్ ఫంగస్ గుర్తించారు. బ్లాక్ ఫంగస్ భారిన పడి వారం రోజుల వ్యవధిలో ముగ్గురు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. మృతుల్లో మార్కాపురానికి చెందిన ఇద్దరు, చీరాలకు చెందిన ఒకరు ఉన్నారు.
చికిత్సలో సమస్యలు..
బ్లాక్ ఫంగస్ చికిత్సలో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం. బ్లాక్ ఫంగస్ చికిత్సకు లిపోసామాల్ అంఫోటేరిసిన్ బీ ఇంజక్షన్ అవసరం. దేశంలో కేవలం నాలుగు చోట్లే ఈ ఇంజక్షన్ తయారీ అవుతుంది. ఒక పెసెంట్ కు సర్జరీ చెయ్యాలంటే 104 వైల్స్ కావాల్సి ఉంటుంది. రోగిని బట్టి ఒక కేజీ వైట్ కి ఐదు మిల్లి గ్రాముల ఇవ్వాల్సి ఉంటుంది. రెండు నుండి మూడు వారాలు వైద్యం తీసుకోవాలి. ఆల్టర్ నేటివ్ గా జోల్ డేర్వేటివ్స్ టాబ్లెట్స్ కూడా వాడతారు. ఈ ఫంగస్ ను ముందుగానే గుర్తిస్తే సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు.