Breaking: శ్రీకాకుళం జిల్లాలో పురాతన వంతెన కుప్పకూలింది. ఇచ్చాపురం సమీపంలోని బహుదా నదిపై ఉన్న వంతెన ఈ వేళ ఉదయం ఆరు గంటల సమయంలో ఒక్క సారిగా కూలిపోయింది. బ్రిటీష్ కాలంలో 1929 లో ఈ వంతెనను నిర్మించారు. ఇచ్చాపురం పట్టణం నుండి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. శిధిలావస్థకు చేరుకున్న ఈ వంతెన పై నుండి ఉదయం 70 టన్నుల బరువు ఉన్న గ్రానైట్ లోడ్ లారీ వెళుతున్న సమయంలో ఒక్క సారిగా వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఆ సమయంలో వంతెన పైన వెళుతున్న వాహనాలు కింద పడిపోయాయి. బ్రిడ్జ్ ఒక్క సారిగా కూలడంతో లారీ కింద పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వంతెన కూలిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బ్రిడ్జికి నదికి మధ్య 20 మీటర్ల ఎత్తు మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై ఇతర వాహనాలు ఏమైనా ఉంటే ప్రమాదం తీవ్రత పెరిగేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెన శిధిలావస్థకు చేరుకుందని స్థానికులు అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.