ఎస్ ఇప్పుడు ఇదే చర్చ ఏలూరు జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. ఏలూరు పార్లమెంటు సీటు తెలుగుదేశం పార్టీకి బలమైన సీటు. పైగా జనసేన – బీజేపీ పొత్తు కూడా ఉండడంతో చాలా సింపుల్గా ఏలూరు పార్లమెంటు స్థానాన్ని తెలుగుదేశం గెలుచుకోవచ్చు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏలూరు పార్లమెంటు సీటులో తెలుగుదేశం గెలుస్తుందా ?అన్న సందేహాలు తెలుగుదేశం పార్టీ నాయకులు.. తెలుగుదేశం పార్టీ క్యాడర్లోనే వినిపిస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నూజివీడు స్థానం ముందు నుంచి పార్టీకి వీక్గా ఉంటుంది.
ఇక్కడ తెలుగుదేశం చివరిసారిగా 2009లో మాత్రమే గెలిచింది. 2014, 2019 ఎన్నికలలో కూడా పార్టీ ఓడిపోయింది. పైగా ఇప్పుడు కూడా నూజివీడు తెలుగుదేశం అభ్యర్థిగా వలస వచ్చిన వైసీపీ నేత మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయన నాయకత్వాన్ని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక పార్లమెంటు పరిధిలోని ఉంగుటూరు సీటును జనసేనకు ఇచ్చేశారు. సాక్షాత్తు ఇక్కడ నుంచి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గని వీరాంజనేయులు సీటు ఆశించినా.. ఆయనకు నిరాసే మిగిలింది.
ఇక పోలవరం సీటును ఎప్పుడు అయితే జనసేనకు ఇస్తున్నారని ప్రకటన వచ్చిందో.. ఆ సీటుపై టీడీపీ నేతలు గెలుస్తామన్న ఆశలు వదిలేసుకున్నారు. ఉంగుటూరు, పోలవరం సీట్లు జనసేనకు ఇవ్వగా.. కైకలూరు సీటును బీజేపీకి అంటున్నారు. అది కూడా కామినేని శ్రీనివాస్కు కాకుండా.. సోము వీర్రాజుకు సీటు ఇస్తే కైకలూరు కూడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదంటున్నారు. ఇక నూజివీడులో ఎలాగూ పార్టీ వీక్గా ఉంది. ఇక పార్టీకి కాస్త కూస్తో ఆశలు కనిపిస్తున్న నియోజకవర్గాలు రెండు మాత్రమే. అందులో ఒకటి ఏలూరు. రెండు చింతలపూడి.
ఇక దెందులూరులో హోరాహోరి పోరు నెలకుంది. ఇక్కడ నుంచి పార్టీ బయటపడిన అతి స్వల్ప మెజార్టీ మాత్రమే వస్తుందని లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు వైసీపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ అభ్యర్థి అయిన కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సునీల్ తండ్రి మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఈ ప్రాంతంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఈక్వేషన్లు చూస్తున్నా.. అటు కూటమి వేస్తున్న ఎత్తులు చూసినా.. ఏలూరు పార్లమెంటు సీటుపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరటం అంతా సులువుగా కనిపించడం లేదు.
పార్టీకి పట్టున్్న పార్లమెంటు స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏకంగా మూడు సీట్లు పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి ఇచ్చేస్తే ఇంకా తెలుగుదేశం ఇక్కడ ఎలా బలం పుంజుకుంటుంది..? అని ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇక్కడ కచ్చితంగా టీడీపీనే పోటీ చేస్తుందా..? లేదా..? పార్లమెంట్ నుంచి బిజెపి అభ్యర్థి రేసులో ఉంటారా..? అన్నది కూడా ఎప్పటి వరకు తేలకపోవటం కూడా మైనస్ గా ఉంది.