Chandra Babu: ఏపిలో నెల్లూరు కార్పోరేషన్ తో పాటు 12 మున్సిపాలీటీల్లో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో సహా పలు మున్సిపాలిటీల్లో వైసీపీ నేతలు అధికార బలంతో దొంగ ఓట్లు వేయించుకుంటున్నారని టీడీపీ ఆరోపణ చేస్తుండగా, దొంగ ఓట్లు వేయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీదేనని వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం అపహాస్యం పాలు చేస్తోందని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసింది ఎప్పుడూ లేదన్నారు. తప్పుడు పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయబోతున్నారని తాము ముందే చెప్పామనీ..ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు చంద్రబాబు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని అక్రమాలకు పాల్పడాలా అని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని చెప్పారు.
Read more: AP High Court: రాజధాని కేసులపై ఏపి హైకోర్టు సీజే జస్టిస్ మిశ్రా కీలక వ్యాఖ్యలు..! ఏమన్నారంటే..?
Chandra Babu: టీడీపీ ఏజంట్లనూ అరెస్టు చేశారు
పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందనీ, దొంగలకు వంతపాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు. కుప్పంలో దొంగ ఓటర్లను రాత్రే టీడీపీ నేతలు పట్టుకుని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఫిర్యాదును పట్టించుకోకుండా టీడీపీ నేతలనే అరెస్టు చేశారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ పోలింగ్ ఏజంట్లను అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారన్నారు. ఏమి చేసినా జరిగిపోతుందని అనుకుంటే శిక్ష తప్పదన్నారు. జరుగుతున్న అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని అన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం చేతకాకపోతే ఎన్నికలను ప్రభుత్వమే నిర్వహించుకోవచ్చని చెప్పి పోవచ్చు కదా అని అన్నారు చంద్రబాబు. వైసీపీ ఎంపీలు, మేయర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లారనీ, వారి వాహనాలను పోలీసులు ఎందుకు సీజ్ చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. శాంతి భద్రతల పేరుతో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ఇష్టానుసారం వ్యవహరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతుందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు.