Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి రోజు కస్టడీ విచారణ ముగిసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు శనివారం తొలి రోజు ఆయన తరుపు న్యాయవాదుల సమక్షంలో విచారించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ లోని కాన్ఫరెన్స్ హాలులో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టునకు సంబంధించి కొన్ని కీలక ఫైళ్లను చంద్రబాబు ముందు ఉంచి విచారణ జరిపినట్లుగా సమాచారం.
తొలి రోజు సుమారు ఆరు గంటల పాటు విచారణ సాగినట్లు సమాచారం. చంద్రబాబుకు జైల్ ఆవరణలోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విచారణ ప్రారంభించారు. తొలి రోజు 11.30 గంటల తర్వాత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు గంటకు అయిదు నిమిషాలు రెస్ట్ ఇస్తూ విచారణ ప్రక్రియను కొనసాగించినట్లు తెలుస్తొంది. మధ్యాహ్నం ఒంటి గంటకు చంద్రబాబుకు బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. విచారణ విరామ సమయంలో చంద్రబాబు తన న్యాయవాదులతో మాట్లాడుకునే వెసులుబాటు కల్పించారని సమాచారం.
విచారణ తర్వాత కూడా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో అధికారుల బృందం విచారణ ప్రక్రియను కోర్టు ఆదేశాల మేరకు సీఐడీకి చెందిన వీడియో గ్రాఫర్ తో రికార్డు చేయించినట్లు సమాచారం. విచారణ నివేదిక మొత్తాన్ని సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదివారం నాడు ఈ కేసుకు సంబంధించి రెండో రోజు విచారణ జరగనుంది. రేపు సాయంత్రం విచారణ పూర్తి అయిన తర్వాత చంద్రబాబును వర్చువల్ పద్దతిలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు సీఐడీ అధికారులు.