CREDAI: ఏపిలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుండి పగటి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నది. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకూ మాత్రమే వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రజా రవాణాకు మినహాయింపు ఉంది. ఈ వ్యవదిలోనే ప్రజలు బయటకు వెళ్లి వివిధ రకాల నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలుతో సహా ఇతర పనులు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే కర్ఫ్యూ కారణంగా వివిద ప్రాంతాల్లో పనులకు వెళ్లే భవన నిర్మాణ కార్మికులు సాయంత్రం సమయంలో ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి. భవన నిర్మాణ రంగంపై కర్ఫ్యూ ప్రభావం తీవ్రంగా పడుతోంది. దీంతో కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు భవన నిర్మాణాలు ఆలస్యం అవ్వడం వల్ల బిల్డర్ లు నష్టపోతారు.
ఈ సమస్యలను ఏపి క్రెడాయ్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. క్రెడాయ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి రాజా శ్రీనివాస్, కేఎస్ సి బోస్ తదితరులు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ లను కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రజా శ్రేయస్సు, ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల పాటు కర్ఫ్యూ విధించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్న క్రెడాయ్ ప్రతినిధులు లక్షలాది మంది కార్మికుల ఉపాధి కల్పించే భవన నిర్మాణ రంగానికి కర్ప్యూ వేళల నుండి మినహాయింపు ఇవ్వలని కోరారు. కర్ఫ్యూలో ఈ వర్గాలకు సడళింపులు లేకపోతే కార్మికులకు జీవనోపాధి దెబ్బతినడంతో పాటు నిర్మాణ రంగ సంబంధిత రంగాలన్నింటిపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు,. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే డెవలపర్లు బిల్డర్ లు భారీ జరిమానాలకు గురవుతారని పేర్కొన్నారు.
ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని సాయంత్రం సమయంలో 5గంటల నుండి 6 గంటల మధ్య కర్ప్యూ నుండి వెసులుబాటు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కార్మికులు సురక్షితంగా పనులు చేసుకునేందుకు భవన నిర్మాణ రంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. క్రెడాయ్ ప్రతినిధుల విజ్ఞప్తి పై నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగే సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ పనులు మాత్రం సజావుగా జరగాల్సిందేనని యంత్రాంగానికి సూచించారు. కరోనా వేళలో కూడా నిర్మాణ పనులు యథావిధిగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, నిర్మాణాలు కొనసాగించడం వల్ల కార్మికుల జీవనోపాధికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్రెడాయ్ సూచనపై సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.