Desha Bill: ఏపీలో మహిళలు, బాలికల రక్షణ కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ దిశ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దిశ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గతంలోనే కేంద్రానికి పంపగా కొన్ని అభ్యంతరాలతో కేంద్రం వెనక్కు తిప్పి పంపింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అడిగిన అదనపు సమాచారాన్ని జోడించి పంపింది. అయితే దిశ బిల్లు చట్టం కాకమునుపే ఏపి ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని కేటాయించింది. అయితే దిశ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని అందరూ భావిస్తున్న తరుణంగా గత పార్లమెంట్ సమావేశాల సందర్భంలో వైసీపీ సభ్యుడు గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా షాకింగ్ సమాధానం ఇచ్చారు. దిశ బిల్లుపై కేంద్ర హోంశాఖ లేవనెత్తిన అభ్యంతరాలు, వివరణలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదంటూ అజయ్ కుమార్ మిశ్రా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Read More: Vallabhaneni Vamsi: చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి క్షమాపణలు చెప్పిన వంశీ..!!
Desha Bill: న్యాయశాఖ పరిశీలనలో..
అయితే.. తాజాగా అదే మంత్రి దిశ బిల్లుపై మరో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంలో దిశ బిల్లుపై వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగి ప్రశ్నకు మంత్రి అజయ్ కుమార్ మిశ్రా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు – క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు – 2019, ఆంధ్రప్రదేశ్ దిశ (మహిళలు మరియు పిల్లలపై నిర్ధిష్ట నేరాలకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానాలు) బిల్లు 2020 రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కొరకు ఏపి ప్రభుత్వం నుండి స్వీకరించామని తెలిపారు. ఈ బిల్లులపై మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ రెండు బిల్లులపై మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తమ అభిప్రాయాలను, వ్యాఖ్యలను తెలిపిందని చెప్పారు. అనంతరం ఈ బిల్లులను న్యాయశాఖకు పంపామని తెలిపారు. ఏపి దిశ బిల్లు – క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు – 2019కి సంబంధించి కేంద్ర హోంశాఖ మహిళా భద్రతా విభాగం వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణల ప్రక్రియ కొనసాగుతోందని సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా వెల్లడించారు.