GVMC Demolition: విశాఖ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కు గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ (జీవిఎంసీ) అధికారులు షాక్ ఇచ్చారు. విశాఖ పాత గాజువాక సెంటర్ లో పల్లా శ్రీనివాస్ నిర్మిస్తున్న భహళ అంతస్తు భవన నిర్మాణం నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని జీవిఎంసీ అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుండి కూల్చివేత పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసర్ అక్కడికి చేరుకుని రాత్రి సమయంలో నిర్మాణాలు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూల్చివేస్తారని మండిపడ్డారు. గత ఏడాది తీసుకున్న అనుమతుల ప్రకారమే తాను భవనాన్ని నిర్మిస్తున్నానని పల్లా శ్రీనివాస్ తెలియజేశారు. అయితే పల్లా శ్రీనివాస్ భవనం కూల్చివేస్తున్నట్లు తెలుసుకున్న స్థానికి టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
అయితే మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించి భవన నిర్మాణం చేసినట్లు జీవీఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ముందుగానే నోటీసులు ఇచ్చామనీ, రోడ్డుకు సెట్ బ్యాక్ వదలలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసి సెలవుదినాల్లో విధ్వంసాలకు పాల్పడుతోందని ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష పూరితంగా టీడీపీ నేతల ఇళ్లు, భవనాలు కూల్చివేస్తుందని విమర్శించారు. పల్లా శ్రీనివాస్ భవనాన్ని జీవిఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన కనీసం నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున భవనాన్ని కూల్చివేయడం దారుణమన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన నాటి నుండి ప్రజా వేదిక మొదలు ప్రతిపక్ష నేతల ఇళ్లు ఎన్ని కూల్చారో లెక్కలేదన్నారు. రోజురోజుకు వైసీపీ రాక్షస సంస్కృతి శృతి మించుతోందనీ, అధికారం శాశ్వతం కాదు తగిన మూల్యం చెల్లించకతప్పదు అని పేర్కొన్నారు.