YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీంలో కలకలం చోటు చేసుకుంటోంది. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఏపీలో రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ హడలెత్తించింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కొత్త కేసులు ప్రజలను వణికించాయి. అయితే… ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీంలో పలువురు నేతలకు కరోనా సోకడం టెన్షన్ పుట్టిస్తోంది.
మంత్రికి కరోనా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన స్వయంగా ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారరణ అయ్యినట్లు పేర్కొన్నారు. కొద్దిపాటి జ్వరంగా ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో మంత్రి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. గత రెండు మూడురోజుల్లో వ్యక్తిగతంగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని గౌతమ్రెడ్డి సూచించారు.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా…
ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా తాజాగా విజయనగరం జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఇద్దరూ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ప్రస్తుతానికి ఇద్దరు ఎమ్మెల్యేలు వైద్యుల పర్యవేక్షణలో హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నారు. గత కొన్నిరోజుల వ్యవధిలో తమను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ఓ మంత్రి , ఇద్దరు ఎమ్మెల్యేలకు కోవిడ్ నిర్ధారణతో ఇప్పుడు జిల్లా వైసీపీ క్యాడర్ లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.