ఏ ఇద్దరు నాయకులు కలిసినా.. విజయవాడ పశ్చిమ సీటు గురించే మాట్లాడుతున్నారు. ఈ సీటును తొలుత జనసేనకు కేటాయించినట్టు ప్రచారం జరిగింది. అయితే.. బీజేపీ పట్టుబట్టడంతో దీనిని ఆ పార్టీకి ఇచ్చారు. అయితే.. స్థానికంగా ఉన్న నేతకు టికెట్ ఇవ్వకుండా.. అసలు నియోజకవర్గంతో సంబంధం లేని.. సుజనా చౌదరిని తీసుకువచ్చారు. ఆయనకు టికెట్ ప్రకటించిన తర్వాత.. ఇప్పటి వరకు టీడీపీ నేతలు కానీ.. జనసేన నాయకులు కానీ, ఆయనకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేక పోయారు.
దీనికి కారణం.. ఆయన హైప్రొఫైల్ మెయింటెన్ చేయడమే. కానీ, పశ్చిమ నియోజకవర్గం అంతా కూడా మాస్ ఏరియా. ఇక్కడ క్లాస్ ఏరియా కేవలం భవానీ పురం మండలం ఉన్నప్పటికీ.. ఇక్కడ కూడా.. పెద్దగా మధ్యతరగతి వర్గాలు లేవు. అంతా దాదాపు మాస్ జనాలే. వీరికి సుజనా చౌదరి ఎవరో కూడా తెలియదు. పైగా ఆయన ఇప్పటి వరకు.. ఇక్కడ పర్యటించింది లేదు. జెండా మోసింది.. నాయకులతో మమేకమైంది కూడా కనిపించడంలేదు. సుజనా రంగంలోకి దిగితే.. టీడీపీ నుంచి బుద్ధా వెంకన్న , జలీల్ ఖాన్, నాగుల్ మీరా వంటివారే ఆయనకు తోడుగా ఉండాలి.
ఇక, జనసేన నుంచి పోతిన మహేష్.. వర్గం మాత్రమే.. సుజనాకు అండగా ఉండాల్సి ఉంటుంది. బీజేపీ ఉన్నప్పటికీ.. బలమైన నాయకులు లేకపోవడంతో ఆ పార్టీ తరఫున సుజనాకు దక్కే మద్దతు కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో సుజానా బలమైన నాయకుడిగా ప్రొజెక్టు కావాలంటే.. ఖచ్చితంగా ఆయన టీడీపీ, జనసేనలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే.. టీడీపీ అయినా.. జనసేన అయినా.. నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
టీడీపీ నుంచి చూస్తే.. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బుద్దా వెంకన్నలు టికెట్లు ఆశించారు. కానీ, వారికి దక్క లేదు. వీరిని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం సుజనాకు ఉంది. చంద్రబాబు చెప్పినంత మాత్రాన వారు బయటకు వస్తారని చెప్పేందుకు అవకాశం లేదు. ఇక, జనసేన తరఫున టికెట్ ఆశించిన పోతిన మహేష్ కూడా.. తీవ్ర అసంతృప్తితో ఉన్నారు దీనికి తోడు ఈయనపై సింపతీ ఉంది. ఈ క్రమంలో ఈయన సహకారం లేకపోతే.. బీసీల ఓట్లు సుజనాకు పడతాయనేది కష్టమే. మొత్తంగా చూస్తే.. కూటమిలో ఏర్పడిన కల్లోలాన్ని ఆయన ఏమేరకు తగ్గించుకుంటారు? ఏమేరకు తనుకు అనుకూలంగా తిప్పుకొంటా రు? అనే దానిని బట్టే.. సుజనా గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి.