ప్రస్తుత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడిగా పోటీకి దిగారు. ఈ క్రమంలో సీట్లు పంచుకున్నాయి. అయితే.. ఈ పంపకాల విషయంలోనే.. కొన్ని తడబాట్లు తెరమీదికి వచ్చాయి. దీంతో టీడీపీలోను, బీజేపీలోనూ.. జనసేనలో కూడా సొంత నేతలే కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇదిలావుంటే.. కీలకమైన విజయవాడలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈక్వేషన్లు సరిగా లేవనేది పొలిటికల్ అనలిస్టుల మాట. ఇక్కడ టీడీపీ తీసుకుని.. బీజేపీకి ఇచ్చిన స్థానాలు సరిగా లేవని అంటున్నారు.
అలా కాకుండా.. సరైన వ్యూహంతో పంచుకుని ఉంటే పార్టీ గెలుపునకు అవకాశం ఉండేదని.. మూడు నియోజకవర్గాల్లోనూ బలమైన వ్యూహంతో ముందుకు సాగి ఉండే పరిస్తితి ఉండేదని అంటున్నారు. విజయవాడ పరిధిలో తూర్పు నియోజకవర్గాన్ని టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయింది. అయితే.. ఆయన ఇప్పటికే రెండు సార్లు గెలిచి ఉన్న నేపథ్యంలో సహజంగానే ఆయనపై వ్యతిరేకత పెరిగింది.
దీంతో గద్దె ఓటమి తథ్యమని టీడీపీ నాయకులే చెబుతున్నారు. ఈ క్రమంలో ఈసీటును బీజేపీకి ఇచ్చేసి ఇక్కడ నుంచి.. సుజనా చౌదరిని పోటీకి పెట్టి ఉంటే.. ఈక్వేషన్ అదిరిపోయి ఉండేదని అంటున్నారు. ఇది పారిశ్రామిక ప్రాంతం కావడం, బలమైన పారిశ్రామిక వర్గాలు ఆయనకు జై కొట్టే ఛాన్స్ ఉండేదని చెబుతున్నారు. ఇక, విజయవాడ పశ్చిమలో సుజనా ను బీజేపీ తరఫున నిలుపుతున్నారు. కానీ.. ఇది పారిశ్రామిక ప్రాంతం కాదు. దీంతో ఆయనకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
అలా కాకుండా.. జనసేనత తరపున టికెట్ ఆశించిన పోతిన వెంకట మహేష్కే ఇక్కడ టికెట్ ఇచ్చి. మూడు పార్టీలూ బలపరచి ఉంటే.. ఆయన గెలుపు గుర్రం ఎక్కేవారని చెబుతున్నారు. ఇక, సెంట్రల్లో బొండా ఉమాకు ఇచ్చేసినా.. ఆయనకు ఇబ్బంది లేదని.. ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే ఈక్వేషన్ బాగుం దని.. మిగిలిన రెండు చోట్ల కూడా.. కూటమి నేతలు సరైన నిర్ణయం తీసుకోలేదన్నది విశ్లేషకుల మాట. తర్పు నియోజకవర్గంలో సుజనాకు ఇచ్చి ఉంటే.. ఆ ప్రభావం పార్లమెంటు ఓటుపై కూడా పడి.. టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్నికి ప్రయోజనం చేకూర్చేదని చెబుతున్నారు. కానీ, కూటమి అలా చేయలేదు. దీంతో ఎదురీత తప్పదనే విశ్లేషణలు వస్తున్నాయి.