ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం తిరువూరు. ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు రక్షణనిధిని పక్కన పెట్టి మరీ.. ఇక్కడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు అవకాశం కల్పించారు. అంటే.. నిన్న మొన్నటి వరకు టీడీపీ లో ఉన్న నాయకుడిని తెచ్చి.. వైసీపీ టికెట్ ఇచ్చారు. మరి ఇప్పుడు దాసు పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు.. టీడీపీ తరఫున జిల్లాలు దాటి వచ్చిన కొలికపూడి శ్రీనివాస్ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కేనా అనేది కూడా ఆసక్తిగా మారింది.
1994లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీయడంతో ఆ పార్టీ నుంచి నల్లగట్ల స్వామిదాసు కాంగ్రెస్ అభ్యర్థి కోనేరు రంగారావుపై దాదాపు 8వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1999లోనూ మళ్లీ వారే పోటీపడగా.. ఆ దఫా కూడా స్వామిదాసును విజయం వరించింది. కేవలం 1100 ఓట్ల మెజార్టీతో ఆయన బయటపడ్డారు. అయితే.. 2004 నుంచి 2014 వరకు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న స్వామిదాసు పరాజయం పాలవుతూనే ఉన్నారు. వైసీపీ నుంచి పోటీ చేసిన రక్షణనిధి గెలుపొందారు.
2019లో మంత్రి జవహర్ ను తిరువూరు నుంచి తెలుగుదేశం రంగంలోకి దింపగా…వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి పోటీలో నిలిచి రెండోసారి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలు అభ్యర్థులను మార్చాయి. తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన నల్లగట్ల స్వామిదాసు ఆ పార్టీ నుంచి బరిలో దిగారు. తెలుగుదేశం పార్టీ కొలికపూడి శ్రీనివాసరావుకు టిక్కెట్ ఇచ్చింది. వరుసగా మూడుసార్లు స్వల్ప తేడాతో ఓటమిపాలైన స్వామిదాసుపై సానుభూతి పనిచేస్తుందో లేక విద్యావంతుడైన కొలికపూడి వైపు తిరువూరు ఓటర్లు మొగ్గు చూపుతారో చూడాలి.
అయితే.. ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. తిరువూరులో అభ్యర్థిని మారుస్తారనే చర్చ జరుగుతోంది. టీడీ పీ తరఫున టికెట్ రాని మాజీ మంత్రి జవహర్ వ్యవహారంపై చంద్రబాబు ఇంకా ఏమీ తేల్చలేదు. ఆయన కు ఉమ్మడి పశ్చిమలోని ఎస్సీ నియోజకవర్గం కొవ్వూరు ఇస్తారని అందరూ అనుకున్నారు. ఆయన కూడా ఇదే ఆశ పెట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా టికెట్ దక్కలేదు.
దీంతో హర్టయిన జవహర్కు తిరువూరు ఇస్తారని కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరువూరులో కొలికపూడి కన్ఫర్మా? కాదా? అనేది స్థానికంగా డౌట్ కొడుతున్న అంశం. దీనిపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేకపోవడం తో కొలికపూడి కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసుకోలేక పోతున్నారు. మరి ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.