జీవిత కాలం ఉచిత కాల్స్ నినాదంతో రిలయన్స్ జియో మార్కెట్లోకి మెజార్టీ యూజర్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డేటాకు మాత్రమే చార్జీ..జీవిత కాలం ఉచిత కాల్స్ అంటూ సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన జియో గత కొంత కాలంగా ఇంటర్ కనెక్ట్ వినియోగ చార్జీలు (ఐయుసీ) వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సారి ఆఫ్ లైన్ దేశీయ కాల్ లను ఉచితం చేస్తోంది. జనవరి ఒకటవ తేదీ నుండి అన్ని లైవ్ కాల్స్ ఉచితం అని కంపెనీ ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుండి ఐయుసీ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు రియలన్స్ జియో సంస్థ వెల్లడించింది.
2021 జనవరి నుండి జియో మరో సారి అన్ని ఆఫ్ లైన్ కాల్ లను ఉచితం చేయనున్నది. సెప్టెంబర్ 2019 టెలికాం రెగ్యులేటర్ (ట్రాయ్) నిర్ణయం తీసుకున్న తరువాత తన యూజర్ ల నుండి జీయో ఐయూసీ సేకరించడం ప్రారంభించింది. జనవరి ఒకటవ తేదీ నుండి ఏ నెట్ వర్క్ కైనా జియో ద్వారా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక నెట్ వర్క్ నుండి మరో నెట్ వర్క్ కు కాల్ చేసినప్పుడు కాల్ అందుకున్న నెట్ వర్క్ కు కాల్ చేసిన నెట్ వర్క్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జెస్ అంటారు. ప్రస్తుతం ఇది నిమిషానికి ఆరు పైసలుగా ఉంది.
అయితే జీవిత కాలం ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తామన్న నినాదంతో మార్కెట్ లోకి వచ్చిన రిలయన్స్ జియో ఐయుసీ విధానాన్ని తొలగించాలని మొదటి నుండి డిమాండ్ చేస్తోంది. ఎయిర్ టెల్, వోడా ఫోన్, ఐడియా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఐయూసీ అమలును మరి కొంత కాలం పొడిగిస్తూ 2019 సెప్టెంబర్ నెలలో ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రియలన్స్ జియోపై అదనపు భార పడటంతో కంపెనీ కూడా ఇతర నెట్ వర్క్ లకు చేసే వాయిస్ కాల్స్ పై చార్జీలు విధించింది. ఐయూసీ అమల్లో ఉన్నంత కాలమే చార్జీలు వసూలు చేస్తామని అప్పట్లోనే జియో హామీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా రిలయన్స్ జియో ప్రకటన ప్రభావం స్టాక్ మార్కెట్ పై కూడా పడింది. ఈ ప్రకటనతో జియో అతి పెద్ద ప్రత్యర్థి భారతి ఎయిర్ టెల్ షేర్లు రెండు శాతం తగ్గాయి.