KCR: టీఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తన రాజకీయ చాణక్యం చాటుకున్నారు. గత కొద్దికాలంగా విపక్షాలు , రాజకీయ విశ్లేషకులు తన గురించి వేస్తున్న లెక్కలు తప్పని నిరూపించారు.
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో గత కొద్దికాలంగా పెండింగ్లో ఉన్న నిర్ణయాన్ని తాజాగా వెల్లడించేశారు. ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణిదేవిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఆమె దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతూరు కావడం విశేషం.
KCR తెలంగాణలో ఇదే హాట్ టాపిక్….
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఒకటి కాగా, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం మరొకటి. ఈ పోరులో అభ్యర్థుల విషయంలో ఇప్పటికే అన్ని పార్టీలు పోటీలో ఉండే వారి పేర్లను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించాయి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి అవకాశం ఇచ్చిన కేసీఆర్.. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేయకుండా పెండింగ్లో పెట్టేశారు! దీనిపై రకరకాల విశ్లేషణలు వినిపించాయి. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ఇస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
కేసీఆర్ తేల్చేశారు….
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ప్రకటన ఆలస్యమై నేపథ్యంలో టీఆర్ఎస్ పోటీ చేయకపోవచ్చుననే అంచనాలు వెలువడ్డాయి. ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతూరు సురభి వాణిదేవిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ స్థానానికి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచంద్రరావుకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిగా వాణిదేవి ఉండనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.