Supreme Court: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవేళ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు జస్టిస్ అనిరుద్ద బోస్, బేలా ఎం త్రివేది ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. తీర్పు ఏ విధంగా వస్తుంది అన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో వచ్చే తీర్పు చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అరెస్టు చేసిన సమయంలో ఆయనకు అవినీతి నిరోధక చట్టం లోని 17 ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ అనుమతి లేకుండానే తనపై కేసు నమోదు చేసినందున ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని చంద్రబాబు వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి.
చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్ధ లూథ్రా.. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. అదే సమయంలో ఆయనపై ఫైబర్ నెట్ కేసు నమోదు కాగా ఈ కేసులోనూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే .. స్కిల్ కేసులో తీర్పు వెల్లడించిన తర్వాతనే .. ఫైబర్ నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేశారు.
మరో పక్క స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు కూడా సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17,19 తేదీల్లో విచారణకు రానున్న నేపథ్యంలో ఈరోజు 17 – ఏ పిటిషన్ పై తీర్పును సుప్రీం ధర్మాసనం వెలువరించనుంది. ఈ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువడేంత వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబును సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగా గానీ లేక వ్యతిరేకంగా గానీ తీర్పు వస్తుందా .. లేక రాజ్యాంగ ధర్మాసనానికి ఈ పిటిషన్ ను పంపుతూ నిర్ణయం తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. ఈ కేసులో తీర్పు ఎలా ఉన్నా ఏపీలో ఎన్నికల ముందు రాజకీయ వర్గాల్లో కీలకం కానుంది.
Delhi Liquor Scam: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి ఈడీ సమన్లు .. సమన్లపై కవిత రియాక్షన్ ఇదీ