కీలకమైన అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ ఓటమి అంచున పోరాటం చేస్తోందా? ఇక్క డ టీడీపీ గెలుపు పక్కా అని ఇప్పటికే తేలిపోయిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవా నికి వైసీపీ అమలాపురం పార్లమెంటు అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేసిన విషయం తెలి సిందే. జనసేన తరఫున గత ఎన్నికల్లో రాజోలు నుంచి విజయం దక్కించుకున్న రాపాక వరప్రసాద్ ను బరిలోకి దింపింది. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సరైన అభ్యర్ధి లేకనే రాపాకను రంగంలోకి దింపారనే టాక్ నడుస్తోంది. ఇది వైసీపీకి మైనస్గా మారింది. ఆయనకు పెద్దగా ఆసక్తి లేదనేది మరోటాక్. ఎందుకంటే.. రాపాక తన జీవితంలో ఏ నాడూ పార్లమెంటు స్థాయిని ఊహించుకోలేదు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ మాటలను కాదనలేక.. తప్పదని బరిలో నిల్చున్నారనే వాదన కూడా ఉంది. సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధ ను పక్కనుపెట్టి రాజోలు సీటు ఆశించిన రాపాకను అమలాపురం పార్లమెంటు స్థానానికి పంపించారు.
దీని వెనుక వైసీపీ వ్యూహం ఏదైనప్పటికీ ఆయనకు మాత్రం ఎంపీగా పోటీ చేయడం అంతగా ఇష్టం లేద ని సన్నిహితులు చెబుతున్న మాట. అయితే, టిక్కెట్టు కోల్పోయిన సిట్టింగ్ల కంటే తనపై అధిష్టానం మంచి దృక్పథంతోనే ఈ అవకాశం కల్పించిందన్న సంతృప్తితో రంగంలోకి దిగారు. ప్రచారంలో మాత్రం ఆ ఉత్సాహం కనిపించడం లేదని ప్రత్యర్థితో పోలిస్తే దూకుడుగా వెళ్లలేకపోతున్నరని స్థానికంగా వినిపిస్తున్న ప్రధాన విమర్శ.
రాజోలు అసెంబ్లీ స్థానానికి గొల్లపల్లి సూర్యారావుని ప్రకటించడంతో రాపాక తీవ్ర అసంతృప్తిలో మునిగిపో యారు. రాజోలు విషయంలో అధిష్టానం మరోసారి పునరాలోచించుకోవాలని రాపాక కోరారు. అధినాయక త్వం సర్ది చెప్పడంతో మేమిద్దరం ఒక్కటేనని, గొల్లపల్లి గెలుపు కోసం అంతా కృషి చేస్తామని ప్రకటించా రు. తనకు అమలాపురం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేసినా ప్రచారంలో వేగాన్ని అందుకో లేకపోతు న్నారు. దీంతో ఆయనకు ఎంపీ స్థానంపై అసలు ఇంట్రెస్ట్ ఉందా.. గెలుస్తామా… అన్న మీమాంసలో కేడర్ కూడా కొట్టుమిట్టాడుతోంది.
రాపాకకు కూడా ఇదే అనుమానాలు ఉన్నాయని అందుకే ప్రచారం అనుకున్న స్థాయిలో సాగడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా అమలాపురం పార్లమెంటు స్థానంలో వైసీపీ గెలుపు అంత ఈజీ అయితే కాదనే చర్చ జోరుగా జరుగుతోంది. మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. రాపాక గెలుపు ఈజీ కాదనేది పరిశీలకులు చెబుతున్న మాట.
రాజోలులో తమ పార్టీ తరఫున గెలిచి ఆ తరువాత పార్టీ ఫిరాయించిన రాపాకపై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే బహిరంగంగానే రాపాకపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. వైసీపీలో ఉన్న ఓ వర్గం కూడా ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తుందన్న ప్రచారం నియోజకవర్గంలో నడుస్తోంది. వాళ్లు కూడా క్రాస్ ఓటింగ్కు పాల్పడే అవకాశం లేకపోలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ప్రత్యర్థి బలాబలాలతో సంబంధం లేకుండా.. రాపాక బలహీనతలే ఆయనను ఓడిస్తాయని అంటున్నారు.