KTR: తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనేక మంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పలువురు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ లు దక్కించుకోగా, మరి కొందరు బీజేపీలో చేరి లోక్ సభ బరిలో నిలుస్తున్నారు.
తాజాగా వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్ధి కడియం కావ్య పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నేడో రేపో తండ్రి, మాజీ మంత్రి కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కడియం కావ్య. మరో పక్క జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కే కేశవరావు కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఇలా వరుసగా చాలా మంది పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ అని కొనియాడారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసిఆర్దని అన్నారు. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారని పేర్కొన్నారు.
ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశమ, దిశను మార్చి కోట్లాది మంది జీతాల్లో వెలుగులు నింపిన కేసిఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారన్నారు. నికార్సైన కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేస్తామని..పోరాట పంథాలో కదం తొక్కుతామని కేటిఆర్ తెలిపారు.