Lock down : దేశవ్యాప్తంగా ఇప్పుడు మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి. దీనికి ఏ రాష్ట్రం , ప్రాంతం మినహాయింపు కాదు. ఇదే రీతిలో తెలంగాణలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో తెలంగాణలో మళ్లీ లాక్డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై వివిధ వర్గాల్లో అనుమానాలు , ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావు స్పందించారు. కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో మళ్లీ లాక్డౌన్ లేదా కర్ఫ్యూ విధించే ఉద్దేశం లేదని శ్రీనివాస్రావు తేల్చిచెప్పారు.
Lock down విద్యాసంస్థల్లో ఏం జరుగుతోంది…
వారంలో రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించాలా? లేదంటే రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఒకటి, రెండు రోజుల్లో దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుండటంపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావు కీలక ప్రకటన చేశారు. కేసులు మళ్లీ పెరుగుతుండటం చూస్తుంటే.. తెలంగాణలో సెకండ్ వేవ్ మొదలైందని చెప్పాలని వ్యాఖ్యానించారు. విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని, విద్యార్థుల ద్వారా ఇంట్లోని వారికి కరోనా సోకే అవకాశముందని అన్నారు. ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని, అర్హులైన వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. గత ఏడాది ఏ చర్యలు చేపట్టామో.. అవే మళ్లీ మొదలయ్యాయని ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కోరారు. కరోనా కట్టడికి అన్నీ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
పాత బస్తీ ప్రజలకు కీలక సూచన
మరోవైపు లాక్ డౌన్ , కర్ఫ్యూ పై తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ కీలక ప్రకటన చేశారు. కర్ఫ్యూ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. పాతబస్తీలోభరోసా కేంద్రానికి పునాది వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మహమూద్ అలీ భారతదేశం అంతటా అలానే పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, హైదరాబాద్ లో రాత్రి కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లు రాష్ట్ర ప్రభుత్వం విధించే ప్రణాళికలు ఏవీ లేవని అన్నారు. లాక్ డౌన్ అనేది ప్రజల జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి పోలీసులు కర్ఫ్యూ విధించే ఉద్దేశం లేదని మహమూద్ అలీ పేర్కొన్నారు. కేసుల పెరుగుదల నియంత్రించడంలో ప్రజలే ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. కర్ఫ్యూ విధించడం నగరంలోని అనేక మంది జీవితాలను, వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుందని స్పష్టం చేస్తూ, మహమూద్ అలీ ప్రజలు, ముఖ్యంగా ఓల్డ్ సిటీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని అనవసర సమావేశాలను నివారించాలని మరియు ఫేస్ మాస్క్లను వెంటనే ఉపయోగించాలని అభ్యర్థించారు.