YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇన్ చార్జిల మార్పులు చేర్పుల ప్రక్రియ నేపథ్యంలో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా ఇవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్నిహితుడుగా పేరున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్టీకి రాజీనామా చేశారు.
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పేర్ని నాని, జోగి రమేష్ తో విభేదాలు ఉండటంతో పాటు లోక్ సభ అభ్యర్ధిగా వేరొక వ్యక్తిని బరిలోకి దింపేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుసుకున్న బాలశౌరి పార్టీకి రాజీనామా చేశారని అంటున్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదని అసంతృప్తిగా ఉన్న బాలశౌరి గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రస్తుతం పెనమలూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొలుసు పార్ధసారధిని మచిలీపట్నం లోక్ సభ స్థానం నుండి పోటీ చేయాలని పార్టీ పెద్దలు ఇప్పటికే కోరగా, ఆయన అంగీకరించలేదు. పార్ధసారధి కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో బాలశౌరి కూడా పార్టీ వీడేందుకు సిద్దమైయ్యారని అంటున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో శుక్రవారం రాత్రి బాలశౌరి భేటీ అయ్యారని వార్తలు వినబడుతున్నాయి. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా బాలశౌరి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గతంలో బాలశౌరి కాంగ్రెస్ పార్టీ తరుపున తెనాలి పార్లమెంట్ సభ్యుడుగా గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుండి మచిలీపట్నం పార్లమెంట్ లోక్ సభ స్థానం నుండి విజయం సాధించారు.
CM YS Jagan: ఏపీ సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షల సందేశం ఇలా..