వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే అందరికీ ఒక రకమైన గౌరవం. వైఎస్ బతికుండగా ఆయన తమ్ముడు వివేకానందరెడ్డి, కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాజకీయాల్లో కనిపించారు. వైఎస్ మరణం తర్వాత అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారి కుటుంబం రోడ్డు మీదికి వచ్చింది. విజయమ్మ, షర్మిల, భారతి అందరూ రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలిపారు. ఆ తర్వాత జగన్ కు మద్దతుగా షర్మిల పాదయాత్రలు చేసింది. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో విజయమ్మతో కలిసి షర్మిల ఆంధ్రా, తెలంగాణలలో పర్యటించింది.
2019లో వైఎస్ జగన్ ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా షర్మిల దూరమయింది. జగన్ దూరం పెట్టాడా ? షర్మిల దూరం అయ్యిందా ? ఆస్తుల పంచాయతీనా ? ఏంటో మాత్రం ఎవరికీ తెలియదు. ఎన్నడూ ఆ విషయంలో షర్మిల క్లారిటీ ఇవ్వలేదు. జగన్ తో పొసగక తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది. ఆఖరు నిమిషంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా చేతులెత్తేసి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవిని తీసుకుని ఆంధ్రా రాజకీయాల్లోకి ఎంటరైంది.
వైఎస్ మరణం తర్వాత ఆ కుటుంబ కష్టాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఒక్కరికీ తెలుసు. అటువంటిది ఏకంగా అదే పార్టీలో షర్మిల చేరిపోవడం వైఎస్ అభిమానులకు రుచించడం లేదు. అయితే ఇదే సమయంలో వైఎస్ విజయమ్మ కూతురు, కొడుకు మధ్యలో నలిగిపోతూ ఇద్దరికీ ఆశీర్వాదాలు ఇచ్చి ఎన్నికల ప్రచారానికి పంపింది. జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిల మీద షర్మిల, వివేకా కూతురు సునీత ఆరోపణలపై మేనత్త విమలమ్మ స్పందిస్తూ అనవసరంగా కుటుంబ పరువును బజారుకు ఈడుస్తున్నారని, ఇకనైనా నోరు మూసుకుని ఉండాలని సూచించింది. దానికి స్పందించిన షర్మిల విమలమ్మ కుమారుడికి జగన్ పనులు ఇవ్వడంతో ఆర్థికంగా బలపడ్డారని, అందుకే వైఎస్ వివేకా మేలును మరిచి జగన్ ను సమర్దిస్తున్నదని వెల్లడించింది.
ఈ పరిస్థితులలో కూతురు, కొడుకు ఇద్దరిలో ఎవరో ఒకరి వైపు ఉండలేక వైఎస్ విజయమ్మ అమెరికాలోని మనవడి వద్దకు వెళ్లిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరూ గౌరవంగా చూసే వైఎస్ కుటుంబం నుండి షర్మిల ఇలా విభేధిస్తూ, ఆరోపణలు చేస్తూ రోడ్డు మీదకు రావడం చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాలి.