తిరుమల శ్రీవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. ఆయన ఈ రోజు ఉదయం స్వామి వారి నిజపాద సేవలో పాల్గొన్నారు. అంబానీ వెంట వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు శ్రీవారి దర్శనానికి రాగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వాదం ఇచ్చారు. టీటీడీ ఇఓ ధర్మారెడ్డి ఆయనకు స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
తదుపరి ఆయన స్థానిక ఏనుగు, గోశాల వద్దకు వెళ్లి పరిశీలించి గజరాజుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా తిరుమల ఆలయం అభివృద్ధి చెందుతోందన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన తెలిపారు. కాగా బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.