Janasena: ఏపీలో బీజేపీ, జనసేన పేరుకు మిత్ర పక్షాలే. కానీ అధికారికంగా ఒక్క కార్యక్రమం కూడా ఉమ్మడిగా పాల్గొన్నది లేదు. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికైన తర్వాత వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు ఒకటి రెండు సందర్భాల్లో కలిశారు. కానీ ఉమ్మడి కార్యచరణ ప్రకటించలేదు. ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తూ పోయారు. పార్లమెంట్, అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతుగా జనసేన ప్రచారం చేయలేదు. అదే విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్ధి జనసేన సహకారం కోరలేదు. జనసేన నాయకులు బీజేపీ అభ్యర్ధికి సహకరించలేదు. సోము వీర్రాజు కారణంగానే జనసేన పార్టీ బీజేపీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందంటూ పార్టీకి రాజీనామా చేయకముందు బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ పెద్దలు తనకు గౌరవం ఇస్తున్నా రాష్ట్రంలోని బీజేపీ నేతలు తమకు సహకరించడం లేదని, ఇక్కడి నాయకుల వైఖరి ఏమిటో అర్ధం కావడం లేదన్నట్లుగా గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా వైసీపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనాలంటే ప్రతిపక్షాలు కలవాలనీ, బలమైన పక్షాలు వేరువేరుగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక వల్ల అంతిమంగా అది వైసీపీకి లాభిస్తుందని బహిరంగంగానే పేర్కొన్నారు. టీడీపీతో పొత్తుతో వెళ్లేందుకు పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత రెండు పర్యాయాలు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కావడంతో పొత్తు దాదాపు ఖాయమే అన్నట్లుగా వార్తలు వినబడ్డాయి. అయితే ఆ తర్వాత అవసరాలను బట్టి వ్యూహాలను మార్చుకుంటుంటామని పవన్ కళ్యాణ్ పేర్కొనడం, గోదావరి జిల్లాల్లో జరుగుతున్నవారాహి యాత్రల్లో తనకు అధికారం ఇవ్వాలనీ, తమ ప్రభుత్వం ఏర్పాటైతే అన్నట్లుగా కూడా మాట్లాడారు.
అంతకు ముందు టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ నేతలను సైతం ఒప్పించే ప్రయత్నం చేస్తానని కూడా అన్నారు పవన్ కళ్యాణ్. మరో పక్క పలువురు ఏపీ బీజేపీ నేతలు మాత్రం అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ జరగక ముందు వరకూ టీడీపీ, వైసీపీ తమకు సమదూరమని, జనసేనతోనే మా పొత్తు అంటూ పదే పదే చెబుతూ వచ్చారు. టీడీపీతో కలిసి పోటీ చేసే ప్రశక్తే లేదని కూడా అన్నారు. గత నెలలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమై వచ్చారు. దీంతో పొత్తులపై చర్చ జరిగిందా లేదా అనేది బయటకు రాలేదు కానీ రకరకాలుగా కథనాలు వచ్చాయి. ఎన్డీఏ లో మళ్లీ కలవడానికి చంద్రబాబు తహతహలాడుతున్నారు. అందుకే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ఇచ్చి ఓట్లు వేసింది టీడీపీ. ఇటీవల ఓ జాతీయ మీడియా ఛానల్ తో చంద్రబాబు మాట్లాడిన సందర్భంలో మోడీ విధానాలను ప్రశంసిస్తూ మళ్లీ ఎన్డీఏ లో చేరేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా పేర్కొన్నారు. ఆ తర్వాతనే అమిత్ షా నుండి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దాంతో ఢిల్లీ వెళ్లి సమావేశమై వచ్చారు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే .. రీసెంట్ గా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందరేశ్వరి అధికార వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు కానీ టీడీపీతో తమ వైఖరి ఏమిటి అనేది స్పష్టం చేయలేదు. అదే క్రమంలో జనసేన పట్ల తమ వైఖరి ఏమిటో చెప్పలేదు. మిత్ర పక్షమైన జనసేన నేత పవన్ కళ్యాణ్ ను కలుస్తామని ప్రకటించలేదు. ఆమె ఎంపికైన తర్వాత జనసేన నుండి అభినందనలు కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రల్లోనూ బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నానని కూడా ఎక్కడా చెప్పలేదు. అయితే అనూహ్యంగా ఈ నెల 18న ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ పక్షాల కీలక భేటీకి జనసేన కు అహ్వానం వచ్చింది. దీన్ని ఆ పార్టీ అధికారికంగా దృవీకరించడంతో పాటు ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హజరు అవుతున్నారని కూడా పార్టీ ప్రకటించింది.
తొలుత టీడీపీకి కూడా ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానం పంపినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చినా ఆ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. టీడీపీకి ఎన్డీఏ ఆహ్వానం అందలేదని ప్రచారం జరుగుతోంది. కేవలం బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి వెళితే వైసీపీనే అధికారంలోకి వస్తుందని, బీజేపీ, జనసేన మళ్లీ బోణీ కొట్టడం కూడా కష్టమే అన్న అభిప్రాయం పవన్ కళ్యాణ్ లో ఉందనీ, అందుకే బలమైన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో కలిసి వెళ్లడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఈ విధంగా ఉంటే ఎన్డీఏ సమావేశానికి జనసేనను ఆహ్వానించి, టీడీపీని పక్కన పెట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టీడీపీ లేకుండా ఎన్డీఏలో జనసేన కొనసాగుతుందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
CI Anju Yadav: జనసేన నేతపై చేయి చేసుకున్న సీఐ అంజుయాదవ్ పై హెచ్ఆర్సీ సీరియస్..నోటీసులు జారీ