Pawan Kalyan: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గొంతెత్తిన జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు కూర్మన్నపాలెం లో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితులకు వైసీపీ పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఈ పాలకులకు, పార్లమెంట్ సభ్యులకు వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని గట్టిగా అడగడం గానీ పోరాటం చేయడం గానీ చేయడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లి ఒత్తిడి తీసుకురాావాలన్నారు. ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ సాకారమైందన్నారు. నాడు విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదం అందరిలోనూ భావోద్వేగం నింపిందని పేర్కొన్నారు. 32 మంది ఆత్మబలిదానాల అనంతరం విశాఖ ఉక్కు వచ్చిన విషయాన్నిగుర్తు చేశారు. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారం ఎంతో ముఖ్యమని అన్నారు.
Pawan Kalyan: ఉన్న ఒక్క ఎమ్మెల్యేని గద్దలా తన్నుకుపోయారు
ప్రభుత్వ రంగ సంస్థలు సుభిక్షంగా ఉండాలని కోరుకునే వారిలో తాను ఒక్కడినని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ..దీన్ని ప్రైవేటీకరిస్తున్నారన్న వార్త వినగానే ఎంతో బాధ కలిగిందన్నారు. వెంటనే ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇతర పరిశ్రమల తరహాలో చూడవద్దని , దీనికి ఉన్న ప్రాముఖ్యత, సెంటిమెంట్ వివరించడం జరిగిందన్నారు. తాను చెప్పిన అంశాలను అమిత్ షా సావధానంగా విన్నారని అన్నారు. నాకు ఒక్క ఎంపీ కూడా లేరు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని గద్ద తన్నుకుపోయినట్లు వైసీపీ తీసుకుపోయింది. మరి ఆనాడు నాకు అమిత్ షా ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారనీ కాదు. మీరు (ప్రజలు) ఉన్నారనే నాకు అపాయింట్ మెంట్ ఇచ్చారు,. ప్రజా బలం ఉంది కాబట్టే నాకు విలువ లభిస్తోంది. లేకపోతే ఒక్క క్షణం లో గడ్డిపోచలా తీసేసి పక్కన బెట్టేస్తారు. నాకు ఎలాంటి స్వార్ధం లేదు. భావితరాలు బాగుండాలన్నదే నా ఆశయం. నిన్నటి తరాలు ఎంతో కష్టపడి ఇవాళ మన చేతిల్లో స్టీల్ ప్లాంట్ పెడితే అది అన్యాక్రాంతం అవుతుంటే బాధ కలుగుతుంది. ఏ పరిశ్రమ నష్టాలు రావో చెప్పండి. ఏ వ్యాపారానిికి నష్టాలురావ చెప్పండి. ఏ పరిశ్రమకు అప్పులు లేవో చెప్పండి. ఒక వేళ నష్టాలు రాని పరిశ్రమ ఉందీ అంటే అది ఒక్క వైసీపీ రాజకీయ పరిశ్రమ అని వ్యాఖ్యానించారు.
కలిసి పోరాటం చేయాలి
నాడు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు క్వాప్టివ్ మైన్స్ కేటాయించాలని యూపీఏ ప్రభుత్వాన్ని ఒక్క ఎంపీ కూడా ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులకు పదవులు ముఖ్యం, డబ్బులు ముఖ్యం, వారికి ప్రజల కష్టాలు, కన్నీళ్లు ముఖ్యం కాదని విమర్శించారు. నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అందరం ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కలిసి రావాలన్నారు. ఇది అన్ని పార్టీలు కలిసివస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. కార్మికుల కష్టాలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వమే తెలియజేయాలన్నారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్నే బాధ్యురాలిని చేయాలన్నారు. అలా చేయకపోతే మనం ఎందుకు పోరాడుతున్నామో కేంద్రానికి తెలియదన్నారు.