ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల రెండవ వారంలో ఏపి పర్యటనకు రానున్నారు. నవంబర్ 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపి ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తొంది. ప్రధానంగా విశాఖ రైల్వే స్టేషన్ లో రూ.400 కోట్ల తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ వస్తున్నారు. అంతే కాకుండా మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారని అంటున్నారు. అనంతరం జరగనున్న భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ పర్యటనలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారు. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై నిన్న కలెక్టర్, ఇతర అధికారులు సమీక్షించారు.
మరో పక్క ఉత్తరాంధ్రలో విశాఖను పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలన్న ఉద్యమాలు జరుగుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్ హామీల పరిష్కారం లభించలేదు. ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఈ అంశాలను ఆయన దృష్టికి రాజకీయ పక్షాలు తీసుకువెళతాయా లేదా అనేది వేచి చూడాలి. త్వరలో విశాఖ నుండే సీఎం జగన్మోహనరెడ్డి పరిపాలన సాగించనున్నారని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై నవంబర్ 1న సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న సంగతి తెలిసిందే.
హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు నుండి మద్యంతర ఉత్తర్వులు (స్టే) వెలువడితే రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటునకు వేగంగా పావులు కదిపే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సఖ్యత కారణంగా ప్రధాని మోడీ చేతుల మీదుగానే పరిపాలనా రాజధాని భవనాలకు భూమి పూజ చేయించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. వికేంద్రీకరణ అంశంపై న్యాయపరమైన చిక్కులను అధిగమించి విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి తీరుతామని అధికార పక్షం చెబుతున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో !.
కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన మల్లికార్జున్ ఖర్గే .. బాధ్యతలు అప్పగించిన సోనియా