TTD: కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఆదివారం) పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఈ మహోత్సవంలో భాగంగా శనివారం (ఇవేళ) సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు.

పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం పూర్తయ్యాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని కనుల విందుగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.
దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శాతాబ్దం నుంచి ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చేసేవారని శాసనాలు తెలుపుతున్నాయి. పూర్వ రోజుల్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగిన ఏడో రోజు స్వామి వారికి పుష్పయాగం చేసే వారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత నిలిచిపోయిన ఈ పుష్పయాగాన్ని 1980 నవంబర్ 14 టీటీడీ పునరుద్దరించి ప్రతి ఏడాది కార్తీక మాసం శ్రవణా నక్షత్రం (శ్రీవారి జన్మనక్షత్రం) పర్వదినాన నిర్వహిస్తొంది.
ఆర్జిత సేవలు రద్దు
పుష్ప యాగం అంకురార్పణ కారణంగా శనివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీతీర్థం సందర్భంగా తిరుమల నుండి సారె తీసుకెళ్లాల్సి ఉన్నందున ఉదయం సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహించారు. ఆదివారం పుష్పయాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
CM YS Jagan: ‘ప్రజాదీవెన ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోను’