కృత్రిమ ఉద్యమంతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి పేరిట జరుగుతున్నది ఉద్యమం కాదన్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బాబు బినామీలు ఆశించిన అవినీతి కుంభకోణం సఫలం కాలేదనీ, దీంతో ఒక కృతిమ ఉద్యమం నడుపుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని తాము ముందు నుంచే చెబుతున్నామన్నారు. అమరావతి–అరసవెల్లి పాదయాత్ర మధ్యలోనే తోక ముడవడంతో అది రుజువైందన్నారు. వాస్తవానికి అమరావతిలో భూములు ఇచ్చిన రైతులంతా వాళ్ల మిగిలిన భూములు కూడా ఎప్పుడో అమ్మేసుకున్నారనీ, ఇంకొందరు తమకు వచ్చిన ప్లాట్లు కూడా అమ్మేసుకుని వేరే చోట భూములు కొనుక్కున్నారని చెప్పారు. చంద్రబాబు చూపిన గ్రాఫిక్స్లో రాజధాని అమరావతి చూసి వ్యాపారం కోసం భూములు కొన్న వారే ఈ కృతిమ ఉద్యమంలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఇలా లక్ష రోజులు కూడా జరుపుకోవచ్చని ఎద్దేవా చేశారు.

పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారనీ, అలాగే రాజధాని అమరావతి కూడా బంగారు గుడ్లు పెట్టే బాతుగా చంద్రబాబు భావించారని సజ్జల అన్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన కలలన్నీ కూలిపోవడంతో.. కొందరు పెత్తందార్లను ఉసిగొల్పి మిగిలిన రాజకీయ పార్టీలను కూడగట్టిన చంద్రబాబు కృతిమ ఉద్యమంతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం ఎజెండాలో ప్రజలు అనే పదమే లేదన్నారు. ప్రజల అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు తోడేళ్ల మందగా అందరినీ కూడగట్టుకుని, దానికి నాయకత్వం వహిస్తూ.. ఏవేవో కథలు అల్లుతూ.. వాటినే నిజమని భ్రమింప చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అమరావతిలో కృతిమ ఉద్యమం నడుపుతున్న చంద్రబాబు ఉచ్చులో వామపక్షాలు, బీజేపీతో పాటు, కొన్ని పార్టీల నాయకులు కూడా పడ్డారని సజ్జల అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణంలో మౌలిక వసతులకే 5 లక్షల కోట్లు కావాలని ఆనాడు కేంద్రాన్ని చంద్రబాబు అడిగారనీ, చివరకు లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయాలని ప్రతిపాదించారని తెలిపారు. కానీ ప్రభుత్వపరంగా ఖర్చు చేసింది కేవలం రూ.1500 కోట్లు కాగా, కేంద్రం ఇచ్చింది మరో రూ.1200 కోట్లు. ఇంకా కొన్ని అప్పులతో పనులు చేశారనీ, అన్నీ కలిపి చూసినా, రాజధాని నిర్మాణంలో చంద్రబాబు తన హయాంలో కనీసం ఐదారు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. కానీ ఇప్పుడేమో ఏమీ లేకుండానే రాజధానిని నడపొచ్చని చంద్రబాబు అంటున్నారనీ, అంటే, రోడ్లు, భవనాలు ఏవీ సరిగ్గా లేకపోయినా ఇక్కడి నుండే పరిపాలన చేయాలా? లేక లిబియాలో గడాఫీ టెంట్లు వేసుకుని పాలించినట్లు ఇక్కడా చేయాలా? అని సెటైర్ వేశారు సజ్జల.
కమ్యూనిస్టు పార్టీలు ఆనాడు ఒక రీతిగా, ఈరోజు మరో విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఆనాడు చంద్రబాబు రాజధాని పేరిట రైతుల భూముల్ని లాక్కున్నప్పుడు, వ్యవసాయం మీద ఆధార పడిన లక్షలాది కుటుంబాలు.. తమ ఉపాధి పోతుందని రోడ్డెక్కి ఉద్యమించినప్పుడు ఇదే కమ్యూనిస్టులు ఏమాత్రం స్పందించ లేదన్నారు. ఈ రోజు మా ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు పెన్షన్లు, కౌలు సకాలంలో చెల్లిస్తోందనీ అయినా కృతిమ ఉద్యమాలు నడిపిస్తున్న వారికే కమ్యూనిస్టులు మద్దతు ఇస్తున్నారని సజ్జల అన్నారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలు ఏయే అంశాలపై ఉద్యమాలు, ఆందోళన చేసేవో.. వాటన్నింటినీ ఈ రోజు సీఎం అమలు చేస్తున్నారనీ, దీంతో పార్టీ అజెండానే లేకుండా పోయే పరిస్థితుల్లో వారికి దిక్కు తోచడం లేదన్నారు. కర్నూలుకు హైకోర్టు కావాలని ఆ రోజు పిలుపునిచ్చిన బీజేపీ ఈరోజు అమరావతిలోనే మొత్తం ఉండాలని ఎందుకు కోరుతోంది? అని ప్రశ్నించారు.
Read More: Sajjala Ramakrishna Reddy: ‘మార్గదర్శది అక్రమాల పుట్ట’