Breaking: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలన సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ వేగవంతంగా జరగడం లేదనీ, దర్యాప్తు అధికారిని మార్చాలని కోరుతూ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గత విచారణ సమయంలో హత్య కేసు సీబీఐ దర్యాప్తులో తీవ్ర జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్ లో అందించాలని ఆదేశించింది.

ఆ నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు ఇవేళ కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు అధికారిని మార్చాలని ఆదేశిస్తూనే అవసరమైతే ప్రస్తుతం ఉన్న దర్యాప్తు అధికారిని కొనసాగించాలని చెప్పింది. స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసినా రాజకీయ వైరంతో ఈ హత్య జరిగినట్లుగా మాత్రమే రాశారనీ, విస్తృత స్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏ మాత్రం దర్యాప్తు చేసినట్లు లేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంత కాలం సాగదీస్తారని సీబీఐని సుప్రీం కోర్టు నిలదీసింది. విచారణ అధికారిని మార్చాలని సీబీఐకి ఆదేశించింది. రామ్ సింగ్ ని కొనసాగించమని చెప్పింది.