SEC : రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మధ్య మరో కొత్త పంచాయతీ వచ్చి పడింది. ఇప్పటి వరకూ ఎస్ఈసీ పై ప్రభుత్వం, ప్రభుత్వం పై ఎస్ఈసీ కోర్టు మెట్లు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. చివరకు సుప్రీం కోర్టు తీర్పుతో రాష్ట్రంలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలి నుండి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఎస్ఈసీ, ఎస్ఈసీని ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళుతున్నాయి. తాజాగా ఎన్నికల కమిషన్ ఎన్నికలను పురస్కరించుకుని తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్ పైనా ప్రభుత్వం కోర్టును ఆశ్రయించగా కోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
SEC :ఏకగ్రీవ పంచాయతీల ఫలితాలు నిలిపివేత
ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించి చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు గుర్తించి ఎస్ఈసీ ఆ ఏకగ్రీవాలను ప్రకటించవద్దంటూ ఆయా జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో 112, గుంటూరు జిల్లాలో 67 గ్రామ పంచాయతీ లు ఏకగ్రీవం అయ్యాయి. అయితే వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఎస్ఈసీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ లు వీటిని ప్రకటించలేదు. ఫలితాలను హోల్డ్ లో పెట్టమని ఎస్ఈసీ ఆదేశించింది. ఆయా జిల్లాలో ఎన్నికల ఫిర్యాదులను పరిశీలించిన తరువాత ఫలితాలను వెల్లడించాలని ఎస్ఈసీ పేర్కొన్నది,. ఎస్ఈసీ నిర్ణయంపై చిత్తూరు జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్ఈసీపై మరో సారి గుస్సా అవుతున్న అధికార పక్షం
అదే విధంగా పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నిమ్మగడ్డ తీరును తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఏకగ్రీవాలు అవ్వకూడదని రాజ్యాంగంలో గానీ చట్టంలో గానీ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఓటు నమోదు చేసుకోవడం కూడా తెలియని ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా అధికారుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టానుసారంగా ఆదేశాలు ఇస్తున్నారని అన్నారు. ఈ ఏకగ్రీవ పంచాయతీ అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఒ పక్క ఎన్నికల కమిషనర్, మరో పక్క ప్రభుత్వం మద్య అధికారులు నలిగిపోయే పరిస్థితి నెలకొన్నదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మళ్లీ కోర్టు గడప ఎక్కే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.