ఏపీలో ఐదు పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఈ రోజు ప్రకటించింది. కడప లోక్ సభ బరిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇది ముందు నుంచి ఊహించిందే. కడప బరిలో షర్మిల ఉంటే ఆ పార్లమెంటు పరిధిలో పోరు ఎంత రసవత్తరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థర్ నందికొట్కూరు నుంచి..ఎలీజా చింతలపూడి నుంచి సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. పార్టీలు మారిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు అవే సీట్లు దక్కాయి. కాకపోతే హస్తం పార్టీ తరపున పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ లిస్టు చూస్తే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఎక్కువ మంది కొత్త వారే ఉన్నారు. వీరిలో కొందరికి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కొత్తే అయినా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతోన్న సీనియర్ నేతలు కూడా ఉన్నారు.
గతంలో షర్మిల తండ్రి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి ఆ పార్టీ కి జవసత్వాలు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ రెండు ఎన్నికల్లో వరుసగా ఓడిపోయాక జరుగుతున్న ఎన్నికలు కావడం.. ఆ వైఎస్సార్ కుమార్తెగా షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టి ఈ ఎన్నికలకు వెళుతుండడంతో ఆసక్తి గా మారింది.
షర్మిల రాష్ట్రం అంతటా విస్తృతంగా పర్యటిస్తుండడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఖచ్చితంగా పెరుగుతుందన్న అంచనాలు అయితే ఉన్నాయి. షర్మిలా రెడ్డి కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తుండడంతో ఇప్పుడు పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సస్పెన్స నెలకొంది. ఇక ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్ లో పులివెందుల అసెంబ్లీకి ఎవరి పేరూ ఖరారు చేయలేదు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె లేదా ఆమె తల్లి ఎన్నికల్ల పోటీ చేసే చాన్సులు ఉన్నట్టు చెపుతున్నారు.
ఇప్పటికే వివేకా కుమార్తె సునీతా రెడ్డి మాట్లాడుతూ తమ టార్గెట్ అవినాష్ రెడ్డి అని..ఆయనను ఓడించడమే లక్ష్యమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పులివెందులలో వారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా లేదా అన్నదే ఇప్పుడు చూడాలి. ఏదేమైనా అటు కడప పార్లమెంటు తో పాటు ఇటు పులివెందుల నుంచి వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ మీద అదే ఫ్యామిలీ వాల్లు పోటీ చేయడంతో కడప రాజకీయాలు వేడెక్కాయి.