ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్ను ఈ రోజు ఏఐసీసీ ప్రకటించింది. 5 పార్లమెంటు స్థానాలతో పాటు 114 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ రోజు వెల్లడించారు. పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల రెడ్డి కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఆమె పేరు తొలి జాబితాలోనే వెల్లడైంది. ఇక కాకినాడ నుంచి మాజీ ఎంపీ, గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన మల్లిపూడి మంగపతి పల్లంరాజు పోటీ చేస్తున్నారు.
మాజీ ఎంపీ జేడీ శీలం బాపట్ల నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. రాజమహేంద్ర వరం పార్లమెంటు నుంచి మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్ర రాజు పేరు ఖరారైంది. కర్నూలు నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పేరు పరిశీలనలో ఉంది. ఇక ఏలూరు నుంచి మాజీ కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావు ఫ్యామిలీతో బంధుత్వం ఉన్న ఎన్నారై కావూరు లావణ్య పేరు పరిశీలనలో ఉంది. ఈ సీటు ఆమెకే ఖరారు కావచ్చంటున్నారు.
ఇక ఈ జాబితాలో తాజా వైసీపీ ఎమ్మెల్యే లుగా ఉన్న ఇద్దరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో కాదు ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్. ఎలీజా తో పాటు కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్. వీరిద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కావడం విశేషం. వీరిని జగన్ పక్కన పెట్టినా షర్మిల తన పార్టీలో చేర్చుకుని మరీ టిక్కెట్లు ఇచ్చారు.
ఇక వైసీపీలో టిక్కెట్లు దక్కని వారు.. అక్కడ ప్రాధాన్యత లేని వారిని కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు షర్మిలా రెడ్డి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.